Sunday, June 30, 2019

అస్తిత్వవాదసాహిత్యం-3

అస్తిత్వవాదసాహిత్యం-3

3. డోస్టోవ్ స్కీ (Dostoevsky )

(1821-1881: Fyodor Mikhailovich Dostoevsky (/ˌdɒstəˈjɛfski/),( Russia)

సాహిత్యప్రియులకు యిష్టమైన సాహిత్యక్రీడ, టాల్స్ టోయ్,  డోస్టోవ్ స్కీ- యిద్దరిలో ఎవరు గొప్ప? ఈ ఆట ఎప్పటికీ ముగియదు. ఇద్దరూ ఒకరిని మించినవారు ఒకరు, ("Both are better") అనుకొని ఊరుకోవడమే. ప్రస్తుతసందర్భంలో చెప్పుకోవలసింది, యితడి “ నోట్స్” (Notes from[ the]  Underground) అస్తిత్వవాదనవలలలో మొదటిది అని అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తారు.అయితే యితని రచనలన్నీ యీ అస్తిత్వవాదచట్రంలో యిమిడిపోతాయా అన్నది ప్రశ్న. మరొకటి, అస్తిత్వవాదంలో యితడు ఆస్తికవర్గంలో చేరుతాడా, నాస్తికవర్గంలోనా? ఇతడి ప్రసిద్ధవాక్యం “దేవుడు లేకపోతే, ఏం చేసినా అభ్యంతరం ఉండదు” ( "Without God, all things are permitted.") (నిజానికి, యీ మాట అతని నవల “ The Brothers Karamazov"లో ఒక పాత్ర , ఇవాన్ , అన్నది.) టాల్ స్టోయ్ కీ, డోస్టోవ్ స్కీకి భేదం చెప్పాలంటే, నవలారచయితగా టోల్ స్టోయ్  ఒక మెట్టు పైననే నిలుస్తాడు.కాని, అతని ప్రేరణ పొంది, అతన్ని అనుసరించిన రచయితలు లేరు. (ఆ మాటకొస్తే షేక్స్ పియర్ కూ ఎవరూ వారసులు లేరు. షేక్స్ పియర్ ప్రస్తావన టాల్స్టోయ్ కు నచ్చకపోవచ్చు.డోస్టోవ్ స్కీ కి  అర్థమైనట్టు షేక్స్ పియర్ టోల్స్టోయ్ కి  అర్థంకాలేదు) డోస్టోవ్ స్కీ ఒక కొత్త తరానికి ప్రేరణగా ముందు నిలిచాడు.  "ఇరవయ్యో శతాబ్దాన్ని ప్రభావితం చేసినవాడు కార్ల్ మార్క్స్ కాదు డోస్టోవ్ స్కీ”,  అన్నాడు కామ్యూ (Camus). డోస్టోవ్ స్కీ  పాత్రలు, సాధారణ వ్యక్తులు కారు. ఏదో దయ్యం పట్టినవాళ్ళలా ప్రవర్తిస్తారు. పాఠకుణ్ణి దయ్యంలా వదలకుండా  పట్టుకుంటారు. వాళ్ళు మనల్ని వదలరు, మనం వాళ్ళను వదలలేము.
స్వేచ్ఛకోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. స్వేచ్ఛకోసం వాళ్ళకు వాళ్ళు ఎంత నష్టమైనా కలిగించుకుంటారు.  రెండు రెళ్ళు అయిదు చేయడంకోసం తల బద్దలు కొట్టుకుంటారు, రక్తం కారినా ప్రాణం పోయినా. పరిమితులను విధించే ఏ శక్తినైనా అంగీకరించలేని స్వేచ్ఛాస్వభావం వారిది. స్వేచ్ఛ అస్తిత్వవాదమంత్రం.

ఇక్కడ పరిచయం చేయబడుతున్న రెండు రచనలు:

1.  కలుగులో కన్న కలలు
(" Notes from[ the]  Underground ".1864)

2. పాపము ప్రక్షాళనము
( The Brothers Karamazov (1880) లో అంతర్భాగమైన ఒక కథ)







1.  కలుగులో కన్న కలలు
(" Notes from[ the]  Underground ".1864)








 “ఒక పుస్తకాల షాపులో, చాపిన చేతికి అనుకోకుండా అందింది..అప్పుడే ఫ్రెంచిలోకి అనువాదమయింది…ఏదో తెలియని అనుబంధం (లేక, ఏమనాలి?)నా ఆనందానికి అవధులు లేవు.”(“నోట్స్” గురించి నీచ, Nietzsche)

                                            *****

( " Notes from [the] Underground ": by Dostoevsky. 167 పుటలు. దీన్ని నవల అని, నవలిక (novella) అని కూడా  వ్యవహరిస్తారు. ఈ నవలలో రెండు భాగాలు.  మొదటి  భాగం మొత్తం  కథానాయకుడి స్వీయపరిచయం. రెండవది  కథాభాగం , అతడు చెప్పుకున్న  ఒక స్వీయానుభవం.రెండు భాగాలను కలుపుతూ ఒక ప్రేమకవిత. కథ మొత్తం ఉత్తమపురుషలో చెప్పబడింది.ఈ వ్యాసంలోని నవలాభాగాలు, ఆంగ్లానువాదానికి తెలుగులో నా భావానువాదం.)

కథానాయకుడి స్వీయపరిచయం:
 
"నలభై ఏళ్ళ తరువాత బతకడం కుసంస్కారం, అసభ్యం, అధర్మం. నలభై ఏళ్ళ తరువాత బతికేవాడెటువంటివాడై ఉంటాడు?  చెప్పండి! గుండెమీద చెయ్యి వేసుకొని , నిజంగా నిజాయితీగా చెప్పండి!నే చెబుతాను: మూర్ఖులు, దుర్మార్గులు. నాకేం మొహమాటం లేదు. ఈ ముసలాళ్ళందరితో , గౌరవనీయులైన తలపండిన పెద్దమనుషులందరితో అంటాను! వాళ్ళ మొహాలమీదే అంటాను! మొత్తం ప్రపంచానికి చాటి చెబుతాను! చెప్పే హక్కుంది నాకు. చెబుతూనే ఉంటాను, నా అరవైయో ఏట కూడా, డెబ్బై, ఎనభై...!"

తొంభై , శతమానం అని మనం కూడా అక్షింతలు వేయవచ్చు. వీడెవడో తిక్కలోడు. మనం అనడం కాదు, అతడే చెప్పుకొంటున్నాడు,సగర్వంగా.నవల ప్రారంభ వాక్యాలు:

"నాకు జబ్బు...నాకు ద్వేషం. నన్నెవరూ యిష్టపడరు. నా  లివర్ పాడయిందనుకుంటా. పాడయిందో లేదో,నా జబ్బు గురించి నాకు ఏమీ తెలీదు. అసలది ఏ జబ్బో కూడా నాకు నిర్ధారణగా తెలీదు. నేను డాక్టరును సంప్రదించను. నేనసలు ఎప్పుడూ ఏడాక్టరును చూడను. డాక్టర్లను వైద్యశాస్త్రాన్ని  గౌరవిస్తాను. అంతే కాదు, నేను దేన్నైనా చాలా గుడ్డిగా నమ్మేస్తాను, వైద్యశాస్త్రాన్ని  కూడా. ( అలా అని నేను చదువుకోనివాణ్ణి అనుకుంటారేమో? మూఢనమ్మకాలు పెట్టుకోరాదు అని తెలుసుకోగలిగినంత చదువు ఉంది. అయినా,  నేను గుడ్డిగా నమ్ముతాను.) ఊహూ, నేను డాక్టరు దగ్గరకు వెళ్ళను. డాక్టర్లంటే నాకు ద్వేషం. అది మీకర్థం కాదనుకుంటా. పరవాలేదు, నేనర్థం చేసుకోగలను. నిజమే, ఈ ద్వేషం వలన, ఎవరికి నష్టం అని మీరు అడగవచ్చు.  నేను ఫీజు యివ్వనందున డాక్టర్లు నష్టపోరు.నాకు బాగా తెలుసు, నష్టపోయేది నేనే అని. అయినా, నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళను.నాకు వాళ్ళంటే ద్వేషం. నా లివర్ పాడయింది. అయితే అవనీ. ఇంకా పాడవనీ."

ఇంతటితో ఆగదు యితని తిక్క.

"నేను ప్రమాణం చేసి చెబుతున్నాను.అతి తెలివి ఒక జబ్బు. బాగా స్థిరపడిపోయిన జబ్బు. మనిషి రోజువారీ అవసరాలకు అంత తెలివి అక్కరలేదు.సంస్కారి అయినవాడికి అందులో సగం తెలివితేటలు చాలు.సగం కూడా అవసరం లేదు. పాతికవంతు చాలు."

ఇంతేనా అంటారా? అయితే ఇదిగో:

"రెండూ రెండూ  నాలుగు అనడం కంటే దురహంకారం ఉండదు! రెండూ రెండూ  నాలుగే. గొప్ప సత్యం. కాదనను. కాని రెండూ  రెండూ  అయిదు అనుకోడంలో ఎంత అందముంది! "

ఇంకా ఉంది యితని తిక్క:

" నేను ఒక కీటకంగా మారి పోవడానికి తీవ్రప్రయత్నం చేశాను. కాని కాలేక పోయాను."

ఇతడు కాఫ్కా  కథలోని  (Metamorphosis) పురుగుకు పూర్వపురుషుడా? లేక యిది  ఒక అసమర్థుని ఆత్మకథా?

కీర్క్ గార్డ్ చెప్పుకున్నాడు, వ్యంగ్యం తనలో గుచ్చుకున్న బాణమనీ, అది తన ప్రాణమనీ. ఈ డోస్టోవ్ స్కీ నవలకు ప్రాణం వ్యంగ్యమని చెప్పనక్కరలేదు. బాణాన్ని పీకేస్తే, ప్రాణమే పోతుంది.

ఈ కథానాయకుడు కొంతకాలం ప్రభుత్వోద్యోగిగా పనిచేసాడట. ఏదో గుమస్తా ఉద్యోగం. తన దగ్గరకు వచ్చే వాళ్ళు సాధారణంగా ప్రభుత్వానికి ఏవో అర్జీలు పెట్టుకున్నవాళ్ళు. "వాళ్ళతో  నేను చాలా అమర్యాదగా ఉండే వాణ్ణి. వాళ్ళను బాగా అవమానించేవాణ్ణి. నేను లంచాలు తీసుకునేవాణ్ణి కాదు. మరి దానికి పరిహారంగా ఏదో తీసుకోవాలి కదా!", అంటాడు. "రెండూ  రెండూ నాలుగే ఎందుకు, అయిదెందుకు కాకూడదు? ఆపిల్ పండు చెట్టునుండి రాలి నేలమీదే పడుతుంది, పైకి  ఎగరదు, ఎందుకు? నీకు చిగురువాచి పన్ను పోటు పుడితే మూలుగుతావెందుకు?"

కొంతకాలం తరువాత అతడికి, ఎవరో చనిపోతూ కొద్దిపాటి ఆస్తి రాసేసి పోయారు. ఇదే చాలని, ఉద్యోగం వదిలేసి సెయింట్ పీటర్స్బర్గ్ లో, యిదిగో యీ ఎలకల, పురుగుల కలుగులాంటి గదిలో ఉంటున్నాడు. అక్కడ కూర్చుని రాస్తున్నాను ఈ నోట్స్ అంటాడు, ఎవరూ చదవడానికి కాదట!

ఇంతకూ ఈనవలలో నాయకుడు ఒకడా? ఒకడే, కాని అతడిలో నాయకుడు ,  ప్రతినాయకుడు (anti-hero),  కూడా ఉన్నారు. ఇద్దరు పాత్రలు, ఇద్దరి  గొంతులు గుర్తించగలం. ఈ సూచన నవల ప్రారంభంలో రచయిత చేస్తాడు:

నాయకుడు, ప్రతినాయకుడు (anti-hero),యిద్దరిని  గుర్తించడమెలా?

నవలలోని ప్రారంభవాక్యాలు మళ్ళీ చూద్దాం.

" నాకు జబ్బు." ఈ జబ్బు ఎవరిది?ఒక సారి చదివినపుడు  కథానాయకుడిది.  మరొక  కోణంలో చదివినపుడు ప్రతినాయకుడిది (anti- hero).( మరొక కోణంలో, జబ్బు సమాజానిది కూడా. పిచ్చివాడు లోకానికి పిచ్చి అనుకుంటాడు. మంచితనాన్ని మానసికవ్యాధి అంటుంది లోకం. డోస్టోవ్ స్కీ నవల “ తిక్కలోడు” (The Idiot) నవలలో అందరూ కథానాయకుణ్ణి, holy fool అంటారు.)

కథానాయకుడు: 'నాకు జబ్బు అని ఈ సమాజం అంటుంది' అంటాడు. అవును నాకు జబ్బే. ( ఏమిటి జబ్బు? లివర్ పాడయింది అంటాడు. లివర్ పాడవడం అంటే 'పైత్య'రసోత్పత్తికి (bile) సంబంధించింది. అంటే, పైత్యప్రకోపం. రెండూ రెండూ  అయిదు అనేవాడికి "పైత్యం " అనక మరేమంటుంది లోకం? ) “ఈ సమాజంలో నలుగురూ ఏది వివేకమనుకుంటారో, అది నా దృష్టిలో అవివేకం.”(ఇందుకు తరువాత అనేక నిదర్శనాలు చెబుతాడు.) జబ్బు  సమాజానిది. దానికి అనాధ్యాత్మికత అనే  జబ్బు పట్టుకున్నది. అటువంటి ఆధిగ్రస్తసమాజం  నాలాంటి వాడిని  రోగి అనే అంటుంది. (Spiritually sick society)

ప్రతినాయకుడు. ' నేను ఇదిగో ఈ ఎలుకల కలుగులో బతుకుతున్నాను. ("Underground","under the floorboards".పుస్తకం పేరు పై చర్చ తరువాత చూద్దాం.)ప్రస్తుతానికి కథానాయకుడు, బయటప్రపంచంలో ధైర్యంగా తిరుగుతూ కనిపించలేడు. పురుగులా ఎలుకలా ఫ్లోరింగ్ కింద బతుకుతుంటాడు.మనసు అంతరాంతరాలలో( the subconscious, "under the floorboards") తనకే తెలియని చెప్పుకోలేని ఆలోచనలతో.  ఫ్రాయిడ్ కంటే ముప్పై సంవత్సరాలముందే డోస్టోవ్ స్కీ ఈ subconscious లోకి తొంగిచూచాడు.

అంతేకాదు. కీటకం డోస్టోవ్ స్కీ భావంలో కీలకమైన ప్రతీక. కీటకంలా మారాలన్న కోరికకు యిక్కడ ప్రధానమైన అర్థం,సహజంగా (instinctively) బతకడమని. అంటే, ఏ క్షణానికి ఏది తోస్తే అది చేసేసే  పశుప్రవృత్తిని పొగడుతున్నాడా డోస్టోవ్ స్కీ? కాదు. మనిషి “బుద్ధి”గా బతకాలంటారు వేదాంతులు. అంటే, కరణేంద్రియజ్ఞానం ప్రమాదకరమని, శరీరాన్ని నడిపించే బుద్ధిజ్ఞానమే జ్ఞానమని,  మనలో బలమైన భావం. కాని,శరీరానికి కూడా తెలివి ఉంటుంది అన్న తెలివి (intelligence of the body) మనకు సాధారణంగా ఉండడం లేదు. బుద్ధి యీ శారీరకజ్ఞానాన్ని అణగదొక్కడం ప్రస్తుత మనిషి దుస్థితి, అని డోస్టోవ్ స్కీ అభిప్రాయం. కీర్క్ గార్డ్ కూడా యిదే అన్నాడు,యీ యుగంలో మనిషికి చింతన (reflection) తప్ప ఆర్తి (passion) లేదు,  అది యీ యుగపు జబ్బు, అని. (Sickness unto Death: Kierkegaard)

కీటకం బుద్ధిజీవి కాదు. దాని జ్ఞానమంతా శారీరకమే. దాని పరిధిలో అది స్వేచ్ఛగా బతుకుతుంది, ఆలోచనలతో మునిగిపోదు.విధినిషేధాలు లేవు. బుద్ధికి లొంగిపోదు. “మనిషి రోజువారీ అవసరాలకు అంత తెలివి అక్కరలేదు.సంస్కారి అయినవాడికి అందులో సగం తెలివితేటలు చాలు.సగం కూడా అవసరం లేదు. పాతికవంతు చాలు”, అంటే అర్థం యిదే.

కీర్క్ గార్డ్ అంటాడు:
“అందరూ అంటారు కాలం దుర్మార్గమైపోయిందని. నా అభియోగం అది కాదు. ఈ కాలపు జనం అల్పపు బతుకులు బతుకుతున్నారు. వారి కోర్కెలు అల్పం.వారి పాపాలు అల్పం. భావతీవ్రత లేదు. దేనికొరకూ ఆర్తి లేదు.పురుగుకు అటువంటి ఆలోచనలు కలగడం పాపం కావచ్చు, కాని దేవుని ప్రతిరూపమైన మనిషిలో కాదు.ఈ నాటి మనుషుల కామంలో కూడా మాంద్యం.వారి ఉద్వేగాలు నిద్రాణం.ఎవరిపనులు వారు చేసుకుపోతారు, చిల్లరదుకాణదారుల ఆత్మలు…వీళ్ళంటే అసహ్యం! అందుకే నా ఆత్మ వెనక్కు వెళుతుంది,  పాతనిబంధనం (Old Testament) వైపుకు, షేక్స్ పియర్ వైపుకు.వాటిలోని పాత్రలు కనీసం మనుషులు. [ దేవతలు కాకాపోవచ్చు.] వారు ద్వేషిస్తారు, ప్రేమిస్తారు, పగవారిని హత్యచేస్తారు, పగవారి సంతతిని తరతరాలకు శపిస్తారు. వారు పాపాలు చేస్తారు.”(Either/Or: Kierkegaard (1843)

డోస్టోవ్ స్కీ నవలలలో పాత్రలు కీర్క్ గార్డ్ చెప్పిన యివన్నీ చేస్తారు. డోస్టోవ్ స్కీ కాని కీర్క్ గార్డ్ కాని పాపాలు చేయమనడం లేదు. బండలా యంత్రంలా జీవచ్ఛవంలా బతకడంకంటే, ఏదో ఒక లక్ష్యంకొరకు ఆర్తితో ఏదైనా, హత్య అయినా,  చేయడం మేలే అంటారు. శ్రద్ధ పరమపురుషార్థం, (“Faith is the highest passion in a person":Fear and Trembling). పరమపురుషార్థమైన మోక్షం కొరకే కానక్కరలేదు. పురుషార్థాలలో దేనికొరకైనా, కామమైనాసరే , దాని కొరకు ఉత్కంఠత ఉండాలి. కోరినదానికోసం ఏదైనా చేయగలను అన్న తెగింపు ఉండాలి. డోస్టోవ్ స్కీ పాత్రలు అందరూ ఉన్మత్తులు పిశాచులు.  అటువంటి పైశాచికపాత్రలతో అతని  నవలలు ప్రపంచసాహిత్యంలో అత్యుత్తమమైనవి ఎట్లా అయినాయి? ఈ జీవలక్షణం వలననే, యీ కామోత్కంఠతవలననే, పురుషార్థసాధనలో యీ ఆర్తి వలననే.( ‘పురుషార్థం’లో ‘పురుషుడు’ అంటే  మగవాడని కాదు అర్థం. పురుషుడంటే స్త్రీకూడా. అది మనిషికి పర్యాయపదం.)ఈ జీవలక్షణం వలననే మనిషి ఆత్మ (self)   ఆవిష్కృతమవుతుంది. “ఈ కాలంలో ఎవరికీ అక్కరేనిది ఆత్మ. అది ఉన్నట్టు పక్కవాడు అనుమానిస్తే ప్రమాదం! ఆత్మను పోగొట్టుకోడం ఎవరూ గమనించడం లేదు. పదిరూపాయలున్న పర్స్ పోనీ! పదిమందికి తెలిసిపోతుంది.చేయి, కాలు, అయిదు డాలర్లు, పెళ్ళాం,-ఏది పోయినా వెంటనే లోకానికంతకూ తెలిసిపోతుంది. ఆత్మ పోతే ఎవరూ గుర్తించరు.” (The Sickness Unto Death)


"నలభై ఏళ్ళ తరువాత బతకడం కుసంస్కారం, అసభ్యం, అధర్మం. నలభై ఏళ్ళ తరువాత బతికేవాడెటువంటివాడై ఉంటాడు?  చెప్పండి! గుండెమీద చెయ్యి వేసుకొని , నిజంగా నిజాయితీగా చెప్పండి!నే చెబుతాను: మూర్ఖులు, దుర్మార్గులు. నాకేం మొహమాటం లేదు. ఈ ముసలాళ్ళందరితో , గౌరవనీయులైన తలపండిన పెద్దమనుషులందరితో అంటాను! వాళ్ళ మొహాలమీదే అంటాను! మొత్తం ప్రపంచానికి చాటి చెబుతాను! చెప్పే హక్కుంది నాకు. చెబుతూనే ఉంటాను, నా అరవైయో ఏట కూడా, డెబ్బై, ఎనభై...!"

ఏమంటున్నాడు? వైద్యవిజ్ఞానం పెరిగింది, మనిషి ఆయుర్దాయము పెరిగింది. మనిషి బతుకుకు కాలం కొలమానం కాదు.ఎన్నాళ్ళు బతికావని కాదు? ఎలా బతికావు? దేనికోసం బతికావు? బైబిల్ కథలో అబ్రహాం ఎన్నాళ్ళు బతికాడు? అతని భార్య సారా వయసెంత? వాళ్ళకు ఆ వయసులో ఐజక్ పుట్టలేదా? నూరో ఏట కూడా పిల్లలను కనమని సందేశమా? కాదు.వారు ఆ వయసులో ఉత్సాహంగా ఉండగలగడానికి కారణం వారి శ్రద్ధ (faith).ఆ వయసులో “రెండూ రెండూ అయిదు ఎందుకు కాదు”, అన్న గుడ్డినమ్మకం, faith in the absurd, అసంబద్ధమందు ఆస్తిక్యబుద్ధి. దాని కొరకు ఆర్తి. ప్రపంచమంత హేతువాదంకూడా అడ్డగించలేని ఆర్తి.అటువంటి ఆర్తితో బతుకు.ఎన్నేళ్ళు బతికినా, ఎందుకు బతుకుతున్నావని, ఎవరూ వేలెత్తలేరు.

దేవుడికి అసంభవమనేది లేదు అన్న బైబిల్ వాక్యం కీర్క్ గార్డ్ తరచు స్మరిస్తాడు.
(“But with God everything is possible.” Matthew 19:26).ఇప్పుడు ప్రపంచమంతా ఘోషిస్తున్న వాక్యం డోస్టోవ్ స్కీ అన్నాడంటున్న వాక్యం, “దేవుడు లేకుంటే, ఏదైనా చేయవచ్చు.”
(“ఈ వాక్యం గురించి ఒక గ్రంథమే రాయొచ్చు.రాశారేమో కూడా.వివరంగా చదవాలనుకుంటే కింది లింక్ ను తెరవండి.
“Dostoevsky Did Say It: A Response to David E. Cortesi (2011)
Andrei I. Volkov” https://infidels.org/library/modern/andrei_volkov/dostoevsky.html)

“As flies to wanton boys are we to the gods.They kill us for their sport”అన్నది షేక్స్ పియర్ కాదు కదా! అతని నాటకంలో ఒక పాత్ర.అలాగే యీ వాక్యమూ డోస్టోవ్ స్కీ అన్నది కాదు. అలా అని అతడు అనలేదు అనికూడా అనలేము. పలికించింది తనే కదా? అది అతని నవల The Brothers Karamazov లో ఇవాన్ అన్నమాట. అతడన్నమాటలో అతడికే నమ్మకం లేదని నవలలో తెలుస్తుంది. ఆ వాక్యం సత్యం కాదని నవలలో యితరపాత్రల, సంఘటనల ద్వారా డోస్టోవ్ స్కీ సూచిస్తాడు కూడా.అయినా అది అతని వాక్యంగా స్థిరపడిపోయింది. ఈ వాక్యం రష్యన్ మూలం, ఇంగ్లీషులో దాని అనేక అనువాదాలు పై లింకులో చూడవచ్చు.కొన్ని ఆంగ్లానువాదరూపాలు ఫ్రెంచిఅనువాదాల ఆధారంగా చేసినవి.రష్యన్> ఫ్రెంచి> ఆంగ్లం> తెలుగులో యీ నవల( ‘కరమజోవ్ సోదరులు’ )  అనువాదమయిందో లేదో తెలియదు.  ఇంతకూ యీ వాక్యం ఎలా అర్థం చేసుకొంటున్నాం? “బాస్ యింటికెళ్ళిపోయాడు, ఆఫీసులో మనం ఏమైనా చేసుకోవచ్చు”, అన్నట్టా ? " A good manager is a dead manager" అన్నాడట ఓ మేనేజ్ మెంట్ గురువు ( Peter  Drucker? ) డోస్టోవ్ స్కీ విశృంఖలస్వేచ్ఛను ప్రతిపాదిస్తున్నాడా?

దీనికి సార్త్ర్ సమాధానం:

“దేవుడు లేకుంటే ఏదైనా చేయొచ్చు” అన్న మాట నీతికి స్వస్తివాచకం కాదు. అది నాంది..లేదా, కనీసం అది ఒక కొత్త నైతికతను అన్వేషించడనికి ఆరంభం. . మనిషి తన తప్పులకు పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. తన తప్పులు మాత్రమే కాదు.ఇతరుల కష్టాలకు కూడా తాను బాధ్యత తీసుకోవలసి ఉంటుంది.”(Existentialism is a Humanism" Sartre  (1946)

తనకు గాని లోకంలో మరెవరికిగాని జరగకూడనిది జరిగితే తప్పు పట్టడానికి దేవుడు లేడు కదా,  “విధి రాత”, “వాడి ఖర్మ”అనడానికి?  మనిషే దేవుడై సర్వానికి బాధ్యత వహించవలె. “కరమజోవ్ సోదరులు” నవలలో ఇవాన్ హేతువాది, దేవుడిలేని సృష్టిని అర్థంచేసుకోడానికి ప్రయత్నిస్తాడు. నాస్తికసిద్ధాంతచర్చలు చేస్తుంటాడు, ఆచరించలేడు. స్వయంగా అతని సిద్ధాంతాలపై అతనికే గట్టి నమ్మకం లేదు. నమ్మేవాడుంటే, స్మెర్డ్యకోవ్ (Smerdyakov ) లాగా వాణ్ణి ప్రయోగపశువుగా వాడుకుంటాడు. కాని, అల్యోషాకు అలా అందరి బాధ్యత తీసుకోవడం, పుస్తకాలద్వారా సంక్రమించిన సైద్ధాంతికభావం కాదు, అది అతని స్వభావం.

దేవుడున్నా లేకున్నా, మనిషి మనిషిగా బతకడంలో ఎటువంటి భేదము ఉండనక్కరలేదు. రెండుకు  రెండు కలిపితే అయిదు ఎందుకు కాదు, అనడం మతిలేనితనం కాదు. అది మనిషికి సహజమైన స్వేచ్ఛాస్వభావం. ఈ స్వేచ్ఛకోసం మనిషి ఎంత కష్టమైనా సహిస్తాడు, ఎంత నష్టమైనా  భరిస్తాడు. ఆలోచించగలిగిన మనిషి ఎప్పుడూ తనకు కష్టము నష్టము కలిగించుకోడు, అన్నది హేతువాదం, వికాసవాదం (Enlightenment). ఈ వాదం నిజంకాదు అంటాడు డోస్టోవ్ స్కీ. “తెలిసి”తమకు తాము కష్టము నష్టము కలిగించుకున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి, అంటాడు.  ఈ స్వేచ్ఛాస్వభావాన్ని రాజకీయసామాజికసాంస్కృతికశక్తులు మంచులా కురిసి కప్పేస్తుంటాయి. (ఈ నవలలో మంచు తరచు కురుస్తూ ఉంటుంది.)

నవలలోని పూర్వభాగమంతా యిలా యిన్ని స్థాయిలలో సాగుతుంది. ఏ పాత్ర  గొంతు వినిపిస్తున్నదో స్పష్టంగా తెలియడం కష్టం. ఒకప్పుడు  లోకానికి తన ముఖం చూపించలేక కలుగులో దాగి బతికే కీటకం. మరొకప్పుడు, ‘రెండూ రెండూ కలిపితే నాలుగు అనడం దురహంకారం', అని  ప్రకృతినియతిని సృష్టిధర్మాన్ని ధిక్కరించే  ధీరోదాత్తుడు. ఇతడు ఎవడనాలి? ఇతడు యివన్నీ. అంటే, యితడి కథ  మనిషి కథ.మన కథ. వాస్తవాలకు ఎదురుపడనంతకాలం , బల్లలకింద కలుగుల్లో బతికేవాడు ఎన్ని వేషాలైనా వేయవచ్చు.ఏ ఉపన్యాసలైనా యివ్వవచ్చు, ఏ డైలాగులైనా చెప్పవచ్చు.కనుక మనోవాక్కాయాల మూడు వేషాలు మూడు విధాల డైలాగులు యిందులో ఉన్నాయి.నాయకుడు ప్రతినాయకుడు కూడా మూడు గొంతులతో మాట్లాడుతారు.  మనిషిలోని సహజవైరుద్ధ్యాలను, ‘నవలలలో’  లాగా కాక, యథాతథంగా చిత్రిస్తుంది యీ నవల. (  ఈ కథానాయకుడితో లీజా (Lisa) అంటుంది, “పుస్తకంలా మాట్లాడుతావు”,"You speak like a book") అని. ఇలా తెలిసి చదువుతూ పోతే, శైలిలోని అస్పష్టత సంక్లిష్టతగా స్పష్టమవుతుంది. వైరుద్ధ్యాలు పాత్రలలో కాక మనిషిలో కనిపిస్తాయి. ఆ లోతులు  లొసుగులు వైరుధ్యాలు వికారాలు మనవే అని తెలిసినప్పుడు చాలా యిబ్బంది పడతాం. మన వికారాన్ని అద్దంలో చూసుకోగలిగిన ధైర్యం ఉంటేనే చదవగలం ఈ నవల. అద్దంపై  కోపం వస్తుంది.
   
ఈ నవల డోస్తోవ్ స్కీ  మొదట ( early period) రాసిన నవలలలోదే . కాని మొదట చదవవలసిన నవల కాదు. Crime and Punishment లాగా  ఒక ఊపులో చదివించే నవల కాదు.పరిమాణంలో చిన్నదైనా ప్రయత్నం ఎక్కువ అవసరం. మళ్ళీ మళ్ళీ చదవవలసినది.చదివే కొద్దీ పొరలు పొరలుగా విప్పుకునే రచన. వ్యంగ్యశైలి నడిపిస్తుంటే, భావపులోతులు మనలను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.

మనిషి అంతరాంతరాలలోని  ( subconscious)  సంకులస్థితి  కథలోని సంక్లిష్టతకు ఒక పార్శ్వమైతే, డోస్తోవ్ స్కీ  కాలంనాటి  సైద్ధాంతిక  వాతావరణం మరో పార్శ్వం. ఈ పార్శ్వప్రాధాన్యం తెలియాలంటే,  కథారచయిత గురించి  తెలుసుకోవడం అవసరం.

డోస్తోవ్ స్కీ  జీవితం:

(ఏ రచయిత జీవితం గురించి అయినా ఎంత అవసరమో అంతే తెలుసుకోడం మంచిది.)

డోస్తోవ్ స్కీ  ఒకసారి  ఉరి ఉచ్చులో తలపెట్టి తీసినవాడు. 1849లో రాజద్రోహనేరం కింద అతనిని ఉరితీయవలసింది.చివరి క్షణంలో ఆ శిక్షకు బదులు కఠినకారాగార శిక్ష విధించి , సైబీరియాకు పంపింది జార్  (czar,) ప్రభుత్వం. నాలుగేళ్ళు సైబీరియాలో కఠినశిక్ష తరువాత, మరో ఆరేళ్ళు అక్కడే ప్రవాస జీవితం, సైన్యంలో సేవ. 1859 లో పెళ్ళి చేసుకున్నతరువాత, తిరిగి సెయింట్ పీటర్స్ బర్గ్ కు ( అప్పటి రష్యా రాజధాని నగరం) రావడానికి అనుమతించింది ప్రభుత్వం.
       
ఇంతకూ, ఏమిటి యితని రాజద్రోహం? యూరప్ లోని  మేధావివర్గాల ఉదారభావాలు రష్యాలోకి పాకి అక్కడి యువతను ప్రభావితం చేస్తున్నకాలం అది. ఏమిటా భావాలు? జర్మన్  కాల్పనిక ఆదర్శవాదం ( Romantic Idealism),ఫ్రెంచి సమసమాజపు ఊహాలోకం (Socialist Utopia). బ్రిటన్ నుండి పాకిన యుటిలిటేరియనిజం ( Jeremy Bentham,J.S. Mill వంటి వారి  'సమాజంలో అత్యధికులకు అత్యధిక సుఖసంతోషాలు' అనే వాదాలు) . డోస్టోవ్ స్కీ  కూడా ఆ వాదాల ప్రభావంలో  ఉండినాడు. ఆ వయసులో, ఏ కాలంలోనైనా, అటువంటి అభ్యుదయభావాల ప్రభావంలో పడడం సహజమే. పడకపోవడం అసహజం. ఈ వాదాలే డోస్టోవ్ స్కీ ని  ఉరికంబం ఎక్కించాయి. ( అతడు రాసి,  తన స్వంత పత్రికలో ప్రుచురించిన వ్యాసం  'వ్యక్తివాదము అహంభావము' , ' Individualism and Egoism'  అతని శిక్షకు ప్రధానకారణం.) ఉరిశిక్ష  తప్పి  సైబీరియాలో జైలుశిక్ష అనుభవిస్తున్నప్పుడు, డోస్టోవ్ స్కీ   తోటిఖైదీలతో కలిసి మాట్లాడేవాడు. (మేధావులు తోటివారితో కలవలేరు. ఒంటరితనాన్ని భరించనూలేరు. ఈ సమస్య కూడా నవలలో వస్తుంది.) ఆ  మాటలలో అతడికి అర్థమయిందేమంటే, ఈ మేధావుల ఊహాలోకాలు  రాచరికప్రభుత్వాలకే కాదు, సామాన్యులకు కూడా నచ్చడంలేదని. అక్కడే అతడి ఆలోచనలు మారడం మొదలయ్యాయి. ఆ తరువాత అతడు యూరప్ పర్యటించినప్పుడు ఈ  ఊహాలోకాల  వాస్తవస్వరూపం చూచాడు. అక్కడ అతని ఆలోచనారూపమే మారిపోయింది. ఉరిశిక్ష  డోస్తోవ్ స్కీ కి  మేలుచేసిందనే చెప్పాలేమో?  సైబీరియాలో సామాన్యులతో పరిచయం తన ఆలోచనావిధానాన్నే మార్చేసింది. అనేక కాల్పనికలోకాలు   మనిషిని కనిపించని విడిపించలేని  ఉచ్చులో బిగించివేస్తాయి,మానవ చరిత్రలోను వ్యక్తిజీవితంలోను. ఉచ్చులోనుండి తల బయటకు తీసుకోగలిగినవారు అదృష్టవంతులు.
     
డోస్తోవ్ స్కీ  తప్పించుకున్న ఆ ఉరి స్వరూపం ఏమిటి? లోకంలో ఎప్పుడూ రెండు ప్రధానవాదాలుంటాయి. ఒకటి అభ్యుదయం, రెండవది నిశ్శ్రేయసం. అభ్యుదయవాదాలకు అనేకనామాలు, రూపాలు. హేతువాదం భౌతికవాదం గతితార్కికవాదం యింకా అనేకానేకం. అన్ని వాదాలలో  సామాన్యాంశము ప్రధానాంశం  రొట్టెముక్క . మనిషి బతికేది  రొట్టెముక్క కోసం అనేది ఈ వాదం.  సామాజికశాస్త్రదర్శనాలు అనేకం. కాని వాటిలో విభేదాలు, విధానాలలో మాత్రమే. ఆశయం అన్నిటికి సామాన్యం. ఏమిటి ఆ ఆశయం? సమాజంలో ఎంత ఎక్కువమందికి ఎంత పెద్ద రొట్టెముక్క అందించగలము, అన్నది అన్ని సామాజికదర్శనాల పరమాశయం. ( ఈ రొట్టెముక్క  కథ  డోస్తోవ్ స్కీ ప్రసిద్ధ నవల ' The Brothers Karamazov ' లో ఒక ప్రత్యేక అధ్యాయవిషయం,The Grand Inquisitor . ఈ  వస్తుసామ్యం  గుర్తించి,  "Notes from the Underground " , "The Grand Inquisitor"  కలిపి ఒక పుస్తకంగా అచ్చువేశారు  కొందరు. )  మనిషి  కోరేది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర, అనే  ఈ వాదాలు డోస్తోవ్ స్కీ  ఒకప్పుడు నమ్మినవాడే. కాని, క్రమంగా,  మనిషి కోరుకునేది ఈ విధమైన అభ్యుదయం కాదు అన్న ఎరుక కలుగుతూ వచ్చింది అతనికి. ప్రస్తుత కథ డోస్టోవ్ స్కీ  లోని  ఈ పరిణామము, ఆ దశలోని అంతస్సంఘర్షణల  ప్రతిఫలం .అతడు తరువాత రాసిన నవలల బీజాలు ప్రస్తుత కథలో  కనిపిస్తాయి. ఆ కాలంలో మేధావులను శాసిస్తున్న, మేధావులు శాసిస్తున్న ఆలోచనాసరళితో అతడు పడిన ఘర్షణ, సాధించుకున్న సమన్వయం ఈ కథలో ప్రధానవిషయం. ఆనాటి అనేకానేక  క్లిష్టదర్శనాలతో తలపడడం  సంక్లిష్టతకు మరో పార్శ్వం.ఇది  వస్తువిషయంలో  సంక్లిష్టత.
     
ఇక  రచయిత ఎంచుకున్న   కథనవిధానంలో  కొంత సంక్లిష్టత ఉంది.  ఈ కథలోని పూర్వభాగం వెనుకజరిగినదానిని, ఉత్తరభాగం ముందు జరిగినదానిని చెబుతాయి. డోస్తోవ్ స్కీ  లో యిప్పుడు యిద్దరు వ్యక్తులున్నారు.ఒకడు,  ఉదాత్తసౌందర్యాలతో (sublime and beautiful) నిండిన కాల్పనిక లోకాన్ని సృష్టించుకొని అందులో యథేచ్ఛగా విహరించే   రొమాంటిక్ యువకుడు. రెండవవాడు, ఆ ఊహాలోకాలను వదిలి జీవితవాస్తవాన్ని పట్టుకున్న మనిషి. పూర్వభాగంలో కథానాయకుడు రచయిత రెండవదశను, ఉత్తరభాగంలో రచయిత మొదటిదశను ప్రతిఫలిస్తాడు.ఇటువంటి సంక్లిష్టవిషయాన్ని సవ్యాపసవ్యకథనంతో కథగా మలచడం డోస్తోవ్ స్కీ రచనాప్రతిభకు నిదర్శనం. ఇంత గంభీరమైన తత్త్వచింతనతో వాదప్రతివాదనలతో ఖండనమండనాలతో నిండిన యీ రచన కరపత్రంగా మిగిలిపోవలసినది.అటువంటి దానిని  గొప్ప కథగా మలచడం, ఆగకుండా చదివించడం, సామాన్యమైన కథనప్రతిభ కాదు. ( సంక్లిష్టత అంతా వివరణలో. కథలో కాదు. మొదటిసారి అర్థం కాదు.అయినా నవ్వుకుంటూ చదివేస్తాం. రెండవసారి సంక్లిష్టత క్రమంగా కరిగి పోతుంది. లోతును తెలిసి ఆనందంతో చదువుతాం. మానవజీవితవిషాదసత్యాన్ని వ్యంగ్యంతో రంగరించిన రచనావిధానం ఈ నవలలో కనిపిస్తుంది. ' వ్యంగ్యము విషాదము అక్కచెల్లెళ్ళలాగా చేతులు కలిపి నడిస్తే అది సత్యావిష్కారం' , అంటాడు డోస్టోవ్ స్కీ , వేరొకచోట. ('Tragedy and satire are two sisters who go hand in hand,and the name of both of them, taken together is  "truth." 'The Double' by Dostoevsky)

అనంతరకాలసాహితీస్రవంతుల మూలాలు:

నవల పూర్వభాగంలోని  తాత్వికసాంద్రత కారణంగా, యూరప్ లోని  ఒక తాత్త్వికవర్గంవారు, నవలలోని కథాభాగాన్ని చించి పడేసి,  కథలోని ఈ పూర్వభాగాన్ని వారి కరపత్రంగా మార్చివేసుకున్నారు.ఎందుకంటే, ఈ నవలలో తరువాతికాలంలో యూరప్ లో వచ్చిన అనేక తాత్త్విక సాహితీస్రవంతుల మూలాలున్నాయి. కాఫ్కా , సార్త్ర్, కామ్యూ,బెకిట్-  వీరందరి తాత్త్వికమూలాలు, వీరి సాహిత్యసృష్టికి స్ఫూర్తి ఈ పూర్వభాగంలో ఉన్నాయి. ( కీర్క్ గార్డ్, డోస్టోవ్ స్కీ కవలలని చెప్పవచ్చు, తత్త్వంలో మాత్రమే.)

ఈ నవలను మొదటి అస్తిత్వవాద ( ఎక్సిస్టెన్షలిస్ట్) నవల అంటారు. అంటే అస్తిత్వవాదసిద్ధాంతాలకు అర్థవాదప్రాయమైన రచన కాదు. అస్తిత్వవాదంలోనుండి యీ నవల రాలేదు. ఈ నవలలోనుండి అస్తిత్వవాదం ఆవిర్భవించింది. పందొమ్మిదవ శతాబ్దపు ప్రవక్త  డోస్టోవ్ స్కీ , కార్ల్ మార్క్స్ కాదు, అన్నాడు కామ్యూ, Albert Camus. ( Alienation, commodification of man వంటి భావాలు మొదట వ్యక్తమయింది డోస్టోవ్ స్కీ నవలల్లో.కామ్యూ నవల L'etranger, డోస్టోవ్ స్కీ Underground లో పుట్టి ఉండవచ్చు.కామ్యూ నవలలోని కథానాయకుడికి స్విడ్రిగైలోవ్ (Svidrigailov: Crime and Punishment) స్ఫూర్తి అనవచ్చు. కామ్యూ నవలకు The Stranger అని , The Outsider అని రెండు పేర్లతో ఆంగ్లానువాదాలున్నాయి.) డోస్టోవ్ స్కీ కాలానికి ఉండిన తాత్త్వికచింతనలతో పాటు తన తరువాత రాగల చింతనలను కూడా ఈ నవలలో కదనరంగంలో దించాడు డోస్టోవ్ స్కీ. ఈ తత్త్వాలు ఒకదానితో ఒకటి పోట్లాడడమే ఈ నవలలోని వస్తువు. అయితే ఆ ఫైటింగ్ సీనులో అంతా వ్యంగ్యమే! పాత తెలుగు
సినిమాలలో , పోలీసులు ఈల వేసుకుంటూ వచ్చే చివరి సీనుముందు, ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఆ  సీరియస్  సన్నివేశంలో రేలంగి పద్మనాభం వంటివారు, అప్పుడప్పుడూ హీరోయిన్ కూడా,కామిక్  ఫైటింగ్ చేస్తారు. అటువంటిదే ఈ నవలలో  గంభీరతాత్త్వికవాదాల భీకరవ్యంగ్యపోరాటం.

డోస్టోవ్ స్కీ.  జీవితదృక్పథం: విధి, స్వేచ్ఛ (Fate and Free will)

కథానాయకుడు  వెనుక యిచ్చిన సమాధానాలు మళ్ళీ ఒకసారి చూద్దాం.ఎందుకు అమర్యాదగా ప్రవర్తిస్తావు, అని అడిగితే, ( నవలలో అతడిని ఎవరూ అడగలేదు.అతడి మాటలలో మనం గుర్తించిన ప్రశ్నలు సమాధానాలే యివి) ఏమంటాడు? నీకు పన్ను పోటైతే ఎందుకు మూలుగుతావు, అంటాడు. మూలిగినందువలన పోటు తగ్గదు.పైగా, నీ పక్కవాళ్లకు చిరాకు. అవును, ఎలాగు నా పన్నుపోటుమీద నాకు నియంత్రణ లేదు. అందుకే పక్కవాళ్ల పై నా  కసి తీర్చుకుంటా. అంటే లోకంలోని వ్యతిరేకతకంతా ( negativity )  కారణం, విధిని వ్యతిరేకించలేని, స్వేచ్ఛకు అవకాశం లేని ఈ  నిస్సహాయత , అంటాడు.
   
ఏది ఎట్లా జరగవలెనో,  సృష్టిలో అంతా ముందే నిర్ణయం జరిగిపోయింది, అంటారు, (Determinism). ముందే ఎవరు నిర్ణయించారు? విధి లేక ప్రకృతి.ఈ "విధిరాత" అనడం యిష్టం లేకపోతే, ప్రకృతినియతి (laws of nature) అందాం. ప్రకృతినియతిని తెలియడమే విజ్ఞానశాస్త్రం. ఆ నియతిని తెలిసి ఉండడమే,  శాస్త్రీయదృక్పథం, హేతువాదం. ఈ వాదంనుండి రెండు జీవితదృక్పథాలు ఏర్పడతాయి.
     
ఒకటి: అంతా ముందే నిర్ణయించబడినపుడు, ఏది జరుగవలసి ఉంటే అది జరుగుతుంది.నా బాధ్యత ఏమీ లేదు.  నేనేమీ చేయను.లోకంలో ఎవరికి కష్టమైనా నష్టం జరిగినా నాకు ఎటువంటి బాధ్యత లేదు.చూస్తూ ఊరుకుంటాను.'  రెండు, తన స్వేచ్ఛను హరించిన విధిపై, లోకంపై, కసి ఏర్పడుతుంది. ఈ కసి, అనేకవిధాలైన వ్యతిరేకతగా వ్యక్తమవుతుంది. లోకం పట్ల వ్యతిరేకత, యితరులను అవమానించడం, వారికి కష్టము నష్టము కలిగించడం. మరొక విధమైన వ్యతిరేకత, తనను తాను తక్కువ చేసుకోవడం, తనను తాను అవమానించు కోవడం, కష్టము నష్టము కలిగించుకోవడం. ఈ వ్యతిరేకతలన్నీ ఈ నవలలోని కథానాయకుడిలో కనిపిస్తాయి, ('నాకుజబ్బు...నాకు ద్వేషం...')
           
రెండు:  ఈ శాస్త్రీయదృక్పథం ఏం చెబుతుందంటే, శాస్త్రీయంగా (scientific గా) ఆలోచించి ప్రవర్తించవలె. మనిషికి కలిగే కష్టనష్టాలు విజ్ఞానశాస్త్రానుగుణంగా, హేతుబద్ధంగా (rational) ఆలోచించి ప్రవర్తించనందువలననే, అంటారు. ప్రతి ఒక్కడు  సైంటిఫిక్ గా ఆలోచించి ఆచరించగలిగితే అదే స్వర్గం. విజ్ఞానశాస్త్రం అభివృద్ధి అయే కొద్దీ, మనిషి యింతకంటే శాస్త్రజ్ఞానంతో వ్యవహరిస్తాడు, అతని సుఖసంతోషాలు పెరుగుతాయి. శాస్త్రజ్ఞానం పెరిగే కొద్దీ, హేతుబద్ధంగా ఆలోచిస్తాడు, తనకు మేలు కలిగే విధంగానే ఆలోచిస్తాడు ప్రవర్తిస్తాడు. అప్పుడు లోకంలో సుఖసంతోషాలే ఉంటాయి, లోకమే స్వర్గం. ఇటువంటి స్వర్గాన్నే ఈ నవల ముఖ్యంగా నిరాకరిస్తున్నది. ఈ Notes,  ఆనాటి మరో రష్యన్ నవలకు ప్రత్యాఖ్యానంగా రాసినది .అది,  Nikolay Chernyshevsky రాసిన  "What is to Be Done? "  ఇందులో రచయిత ఒక స్ఫటికహర్మ్యం  ( Crystal Palace) కల్పిస్తాడు. ఇది హేతువాదపుపునాదులపై (Rationalism, ) నిర్మించిన హర్మ్యం.
       
డోస్టోవ్ స్కీ  ప్రధానజీవితదర్శనం ఈ రెండు రకాల వ్యతిరేకతను, బాధ్యతారహితనిశ్చేష్టతను, హేతువాదస్వర్గాన్ని, వ్యతిరేకిస్తుంది. రెండు రెళ్ళు నాలుగే.నిజమే.కాని రెండు రెళ్ళు అయిదు అనే స్వేచ్ఛ  నీకు లేదని ఎందుకు అనుకుంటావు? విధినిర్ణయం జరిగిపోయింది. నిజమే, కాని దాని అర్థం నీ బాధ్యత లేదని కాదు. మనిషి తన స్వేచ్ఛను వదులుకో కూడదు, తన బాధ్యతను మరచిపోకూడదు. ఇది డోస్టోవ్ స్కీ నవలలోని ప్రధాన జీవితతత్త్వం.

" భగవంతుడా! ప్రకృతినియమాలు గణితశాస్త్రము ఏమైనా చెప్పనీ, నాకేమిటి? అవి నాకు యిష్టం లేదు. రెండు రెళ్ళు నాలుగు అనడం నాకిష్టం లేదు.నాకు తెలుసు, ఈ రాతిగోడను నా బుర్రతో బద్దలుకొట్టలేను. అలా అని, దానితో రాజీపడలేను కూడా, ...."

ప్రకృతి నియతికి (laws of nature) లొంగిపోయి మనిషి మరబొమ్మ కారాదు. ప్రాణాలిచ్చైనా సరే తన స్వేచ్ఛను గుంజుకుంటాడు. మనిషి జీవితమంతా చేసేది యిదే, యీ స్వేచ్ఛాపోరాటం. ఈ పోరాటమే తనని మనిషిని చేసేది.ఈ పోరాటం ఎవరినీ విరోధించి కాదు. తనను మనిషిగా నిలబెట్టుకోడానికి. తనలోని మనిషిని నిలబెట్టడానికి.

హేతువాదమేధావులంటారు,మనిషి  తనకు మేలుచేసే పనులు మాత్రమే చేయవలె అనుకుంటాడు, చేస్తాడు  అని. ఎవడైనా ఎప్పుడైనా తప్పుచేస్తే అది తన మేలు తనకు తెలియక చేసినదే, తెలిసి ఎవడూ తనకు తాను నష్టం కలిగే పని చేయడు, అని అంటారు వీరు.కాని డోస్టోవ్ స్కీ యీ వాదంతో ఏకీభవించడు .

"అవును? ఈ  మేధావులకు ఎట్లా తెలుసునట, మనిషి ఎప్పుడు తనకు మేలుచేసే నిర్ణయాలే తీసుకోవాలి అనుకుంటాడని? ....మనిషి తనకు కష్టము నష్టము కలిగించే నిర్ణయాలు ఎన్నో తీసుకున్నాడని మానవచరిత్ర చెబుతుంది."

మనిషి కోరుకునేది నిర్ణయంలో స్వేచ్ఛ. ఆ నిర్ణయం మేలుకైనా కావచ్చు కీడుకైనా కావచ్చు. కాని నిర్ణయం తనది కావాలి. ఆ నిర్ణయస్వేచ్ఛ కొరకు ఎంత మూల్యమైనా చెల్లించడానికి అతడు సిద్ధమే. నరకమైనా సరే! అది అతడు కోరుకున్న నిర్ణయం! అది తన నిర్ణయం! స్వేచ్ఛగా ఎన్నుకున్న నరకం! ఎవడో  తన దోసిట్లో  పడేసే స్వర్గం తనకు వద్దు!

"నేను గంటకొట్టి మరీ చెబుతాను.మనిషి జీవితమంతా  ప్రతి నిమిషము  చేసేదిదే, తనకు తాను  నేను మనిషిని, పియానో కీని(piano key)  కాను, ఎవడు ఏ కీ నొక్కితే ఆ స్వరం పలకడానికి ,నాకు నా స్వంతస్వరం ఉంది, అని నిరూపించుకోవలెనని."

ఏమైనా  సరే  మనిషి  స్వేచ్ఛను వదులుకోడు.తనను తాను శిలువపై ఎక్కించుకోవడానికైనా సరే,  తనకు నిర్ణయస్వేచ్ఛ కావాలి.ఆ స్వేచ్ఛే జీవితపరమార్థం, జీవితసాఫల్యం. హేతువాదులు  కాల్పనికులు,( రొమాంటిక్స్), యింకా అనేక కేవలాభ్యుదయవాదులు సమాజంకోసం నిర్మించే స్ఫటికహర్మ్యం (crystal palace),  తినడానికి  నిద్రపోవడానికి మాత్రమే పనికి వస్తుంది.సమస్తమానవాళికి సుఖసంతోషాలు వాగ్దానం చేసే ఆ స్ఫటికహర్మ్యం సాధ్యంకాదు, సాధించదగినది కాదు. అది పనికిమాలినదే. యూరప్ నుండి వచ్చి రష్యన్ సంస్కృతిని ఆక్రమిస్తున్న  ఈ భావాలకు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించాడు డోస్టోవ్ స్కీ స్వదేశీయసంస్కృతిని కాపాడుకోవలె అన్న తపన అతని రచనలలో కనిపిస్తుంది. బ్రిటిష్ పాలనలో యురపియన్ సంస్కృతి భారతీయసంస్కృతిని ఆక్రమిస్తున్నది  అని ఇక్కడ కొందరు అనుకొన్నట్లే, ఆనాడు రష్యాలోను అనుకున్నారు, డోస్టోవ్ స్కీ వంటివాళ్ళు. ఆక్రమితసంస్కృతులు వేరు కావచ్చు, కాని ఆక్రమించిన సంస్కృతి అక్కడా యిక్కడా ఒకటే, మనిషిని మరబొమ్మను చేసే  భౌతికయాంత్రికఅభ్యుదయవాదం. అందులో, ధర్మము త్యాగము ప్రధానం కావు. డోస్టోవ్ స్కీ కి ఆ రెండు జీవితపరమార్థం. అయితే, ఒకప్పుడు తాను నమ్మిన  అభ్యుదయం నుండి  నిశ్శ్రేయసంలోకి  నడవడంలో ఘర్షణ క్లేశము తక్కువ కాదు. ఆ ఘర్షణ అంతా ఈ కథలో ఉంది. కథానాయకుడిలో మానవసహజమైన వైరుద్ధ్యాలు పాఠకుణ్ణి తికమక పెడతాయి. మనిషి తత్త్వాన్ని (essence) బతకడు, అతడి బతుకు ( existence)  అతడి తత్త్వం అన్న అస్తిత్వవాదసిద్ధాంతం యీ కథానాయకుడి పాత్రలో బతికింది. మనిషి ఆలోచనలు అన్నీ శుభ్రంగా ఉతికి యిస్త్రీ చేసినట్టుండవు.  మరకలు మడతలు దాచకుండా చెప్పిన కథ, పాత్ర యీ నవలలో.
   
ఆనాడు ప్రబలంగా ఉండిన అనేకవాదాలను ఈ కథలో  మొదటి వాక్యంనుండి వ్యంగ్యశైలిలో తిరస్కరిస్తాడు కథానాయకుడు. తిక్కవాగుడు అనిపించే వాక్యాలన్నీ  కొత్త అర్థంతో గంభీరధ్వనితో  కనిపిస్తాయి. ఈ ధ్వన్యర్థంలో, అతడి జబ్బు జబ్బు కాదు. లివర్ లివర్ కాదు. అతడి ద్వేషం ద్వేషం కాదు. అతడి ద్వేషం సమస్తమానవాళిపట్ల సహృదయస్వభావం. మానవత్వం కోసం తనను తాను ఆహుతి చేసుకొనే ఆర్తి.
     
తరువాతకాలంలో డోస్టోవ్ స్కీ  రాయబోయే  అయిదు పెద్దనవలలలో  ఆవిష్కరించిన సామాజిక ధార్మిక దృక్పథానికి  బీజాలు ఈ కథలో ఉన్నాయి. Nikolay Chernyshevsky రాసిన  "What is to Be Done?" లోని crystal palace ను తిరస్కరించడం , Notes లో ప్రధానకథావస్తువు. మనిషి బతికేది రొట్టెముక్క కోసం కాదు,  మనిషి జీవితపరమార్థం స్వేచ్ఛ లేని సుఖసంతోషాలు కావు, అన్నది డోస్టోవ్ స్కీ  రచనల ఆశయం.
         
కేవలాభ్యుదయవాదం నుండి కదిలి నిశ్శ్రేయసాన్ని గుర్తించడం ఒక ద్విజన్మ. కీటకం నుండి  బయటపడడానికి   భ్రమరం  పడే  ద్విజన్మవేదన వంటిదే ఈ కథనంలోని  క్లిష్టత.


స్ఫటికహర్మ్యం: ఉదాత్తత సౌందర్యము(sublime and beautiful)

      సీతాకోకచిలుక  పురుగునుండి బయటపడడంతో కథ పూర్తి కాదు. వచ్చిన రెక్కలతో ఎగరగలగాలి.త్యాగము  ప్రేమ నిండిన జీవితం కోరుకోవడం, అభ్యుదయభావాలను నిరసించి నిశ్శ్రేయసం వైపు రావడం, పోరాటంలో సగభాగమే. పోరాటం కేవలం బయటి ప్రపంచంతో కాదు, తన లోపల నిలిచిపోయిన ఊహలతో కూడా. ఆ అంతస్సంఘర్షణ ఈ కథలోని శైలి ప్రతిబింబిస్తుంది. అభ్యుదయవాదులలోని ఆత్మవంచన , నిశ్శ్రేయసాన్ని  వల్లించేవారిలోను ఉంటుంది. వీరిలో ఈ వంచన అంతకంటే అసహ్యంగా కూడా ఉంటుంది. ప్రేమ త్యాగం దివ్యత్వం, వీటితో కూడా ఒక స్ఫటికహర్మ్యం నిర్మించుకోవచ్చు. ప్రేమను వాస్తవ జీవితంలోకి వంపుకోడం అనుకొన్నంత  సులభం కాదు.అక్కడ కూడా  ఆలోచనకు ఆచరణకు ఉన్న అంతరాన్ని  వదలడు డోస్టోవ్ స్కీ. కథానాయకుడంటాడు:" ఈ కలలు నిరంతరాయంగా మూడు నెలలకు పైన భరించడం నా వల్ల అయేది కాదు. మళ్ళీ వెళ్ళి జనాలమధ్య పడి తిరగాలనిపించే కోరిక ఆపుకోలేకపోయేవాడిని....తిరిగి తిరిగి యింటికి రాగానే, సమస్తమానవాళిని ప్రేమతో కౌగిలించుకోవాలన్న నా కోరికను కొంత కాలం వాయిదా వేస్తాను."
ప్రేమ త్యాగం ఆగుతాయి, తొందరలేదు!
     
నవల  పూర్వభాగం ఈ కథానాయకుని స్వీయపరిచయంతో ముగుస్తుంది. ఉత్తరభాగం కథ.  పూర్వభాగంలో  తనను పరిచయంచేసుకున్న  కథానాయకుడికి అప్పుడు యిరవైనాలుగేళ్ళ వయసు. (ఇప్పుడు నలభై  అట).మొదటి భాగంలో తత్త్వం చెప్పి, రెండవభాగంలో దాని ఆచరణస్వరూపం కథారూపంలో చూపిస్తాడు,  ఆదర్శానికి ఆచరణకు, కల్పనలకు వాస్తవాలకు మధ్య అంతరం. ఈ అంతరాన్ని సూచించడానికి  నవలలోని  పూర్వోత్తరభాగాలకు సంధిగా డోస్టోవ్ స్కీ  నెక్రసోవ్ అనే రష్యన్ కవి రాసిన ఒక ప్రేమకవితను ఉపయోగించాడు. ఆ కవితలో  ఒకడు ఒక స్త్రీని ప్రేమించాడు. పెళ్ళి నిశ్చయం అయింది. కాని పెళ్లికి ముందే ఆమె తన
హేయగాథను చెబుతుంది, ఎంతో దు:ఖభారంతో, అవమానభావంతో. అతడు ఆమెను క్షమించి పెళ్ళి చేసుకుంటాడు. వారి వైవాహికజీవితం సంతోషంగా సాగింది అని కవిత సూచిస్తుంది. ఈ కవితలో  నాయకుడు ఉదాత్తుడు (hero). ఒక పతితను ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు. కాని, యిందుకు విరుద్ధంగా ఈ నవలలో  ప్రతినాయకుడు (anti-hero), ఊహలలో ఉదాత్తుడు, వాస్తవంలో అల్పుడు, ఆత్మవంచకుడు. వాస్తవం ఎప్పుడూ అల్పమే. రాజకుమారులు కథలలో మాత్రమే పతితలను రాణులను చేస్తారు. ఈ పుస్తకజీవితాలలోని వైరుద్ధ్యాలనే నిలదీస్తాడు యీ నవలలో డోస్టోవ్ స్కీ.

కథాభాగం

(నవల ఉత్తరభాగం, కథానాయకుడి యిరవై ఏళ్ళ వెనుకటి కథ)
ఈ భాగంలో మూడు ప్రధాన యితివృత్తాలున్నాయి.

ఒకటి, కథానాయకుడు (అదే, అతడే చెప్పుకున్న ప్రతినాయకుడు) ఒక మిలిటరీ ఆఫీసర్ తో తలపడడానికి చేసే విఫలప్రయత్నాలు;
రెండు, అతడు ద్వేషించే అతడి “మిత్రబృందం”తో అతని ప్రవర్తన;
మూడు, (ఇది యీ భాగంలోనే కాక మొత్తం నవలలో ప్రధానభాగం),లీజా ( Lisa) అనే వేశ్యతో అతని ప్రవర్తన.

మిలిటరీ ఆఫీసర్:

కథానాయకుడికంటే మిలిటరీ ఆఫీసర్ హోదాలో డబ్బులో శరీరబలంలో అధికుడు. అడ్డమొస్తే రెండు జబ్బలు పట్టుకొని వీథిలోకి విసిరేయగలడు. ఒకరోజు పబ్ లో అతడి దారికి అడ్డొచ్చాడు. ఇతని వైపైనా చూడకుండా, కోటుమీద వాలిన పురుగును విదిలించినట్టు పక్కకు నెట్టి తన దారిన వెళ్ళిపోతాడు. ఆ అవమానం  తరువాత మన కథానాయకుడు ఆ ఆఫీసర్ తో గొడవపడాలని అనేక విఫల (హాస్యపూరిత) ప్రయత్నాలు చేస్తాడు. ఆఫీసర్ తనను ఒకటి పీకుతాడా, కేసుపెట్టి జైలుకు పంపుతాడా, యింకేమైనా హాని చేస్తాడా? ఏదో ఒకటి చేయనీ. అది కనీసం తన అస్తిత్వాన్ని గుర్తించినట్టు. కాని ఆఫీసర్ అలాటివేవీ చేయడు. ఇతడికి ఉక్రోషం పెరుగుతుంది. కాని ఏమీ చేయలేడు, కనీసం ఒక చెంపదెబ్బ అయినా తినలేడు.
ఏమిటి దీని అర్థం? ఇతడికి తెలియదా, ఆ ఆఫీసర్ ను తనేమీ చేయలేడు.
 తెలుసు, రెండూ రెండూ నాలుగే అని తెలుసు. కాని అయిదు ఎందుకు కాదు? అది మనిషి స్వేచ్ఛాస్వభావం. స్వేచ్ఛకొరకు బలమైన యిచ్ఛ. పరిమితులను ఒప్పుకోలేని స్వేచ్ఛాప్రకటన.తల పగులుతుందని తెలుసు.అయినా పొట్టేలు కొండను ఢీకొడుతుంది. దాని తలజిల.

“మిత్రబృందం”:

సౌందర్యమయమైన ఉదాత్త కాల్పనికలోకం కథానాయకుడిది. మన అనామక కథానాయకుడు తను చదువుకునే రోజులనుండీ యింతే. తన  మొదటి వాక్యంలోనే చెప్పుకున్నాడు కదా, తనది ద్వేషస్వభావమని , తననెవరూ యిష్టపడరని. చదువులో  క్లాసు ఫస్టు వచ్చేవాడు, చదువులో శ్రద్ధ వల్ల కాదు,  ఎక్కువ చదివి తక్కినపిల్లలను తక్కువ చేయడానికి. చదువు ముగిసిన తరువాత కూడా వాళ్ళలో ఎవరితోను అతనికి సంబంధాలు లేవు, ఒకే ఒకడు సిమనోవ్ తో తప్ప. అతడు కూడా తనను పూర్తిగా యిష్టపడడని తనకు తెలుసు. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఏదైనా బార్ కు వెళతాడు, ఒంటరిగా. తాగడం కంటే తనకు కావలసింది అక్కడ ఎవడితోనైనా ఏదో విధంగా గొడవపడాలి. ఎవరినైనా అవమానించాలి. ఎవణ్ణైనా చెంపమీద ఒకటి పీకాలి. వాడు తిరిగి కొడతాడా? లేక పోలీస్ స్టేషనుకు లాక్కెళతాడా? లేక, రా బయటికి తేల్చుకుందాం బలాబలాలంటాడా? ఏదో ఒకటి చేయాలి, మహా బోరుగా ఉంది, పుస్తకాలు చదివి చదివి. ( మనిషికి పుస్తకాల వెలుపలకు వచ్చి బతకాలనే ఉంటుంది.కాని పుస్తకాల అట్టలమధ్య అందమైన అవాస్తవిక ఆదర్శకాల్పనిక జగత్తు మరొక వైపు లాగుతుంటుంది.)


ఇతని ఒకప్పటి సహాధ్యాయులతో యితడు ఎప్పుడూ స్నేహం చేయలేదు. వారంతా చదువులో, పరీక్షల చదువులో, బయటచదువులో కూడా, తనకంటే వెనుకబడిన వాళ్ళు. వారంతా నేలబారు బతుకు బతికేవారు. వారిలో ఒకడు, జ్వెర్కోవ్, భూస్వామి. అతడి పొలాలు సాగుచేసుకొని యితనిబానిసలుగా బతికేవారు వందలమంది ఉన్నారు. అతడి డబ్బు,  హోదా చూసి, అతన్ని అనుసరించే మిత్రబృందం.వాళ్ళ తాగుడుకు సరదాలకు జ్వెర్కోవ్ డబ్బు ఖర్చుపెడుతుంటాడు. వేశ్యాగృహాలు వాళ్ళకు పరిచయస్థలాలు. జ్వెర్కోవ్  అంటే మన కథానాయకుడికి అసహ్యము, అసూయ. ఏకకాలంలో రెండూను.వాళ్ళ జీవనవిధానాన్ని తాను అవహేళన చేస్తాడు.వాళ్ళతో కూడా గొడవపడాలని ప్రయత్నిస్తాడు. అదీ వాళ్ళదగ్గర అప్పుచేసి, వాళ్ళతో గొడవపడడానికి అక్కడికి వెడతాడు. ఆ గొడవలో భాగమే వేశ్యాగృహంలో లీజాతో తన పరిచయం.

కథానాయకుడు వాళ్ళముందు కీటకమే, అన్ని విషయాలలోనూ. అన్నిటికంటే ముఖ్యంగా అతని అవాస్తవిక ఆదర్శకల్పనాలోకం.అలా అని అతని మిత్రుల జీవనవిధానాన్ని, విలువలులేని విశృంఖలతను ఆమోదిస్తున్నాడా రచయిత? లేదు.
కాని, విలువలు బతుకులోనుండి రావలె, పుస్తకాలనుండి కాదు. అదీ, పరసంస్కృతినుండి కాదు. ఫ్రెంచి జర్మన్ కాల్పనికవాదప్రభావంలో పడిపోతున్న తన రష్యన్ యువకులను హెచ్చరిస్తున్నాడు డోస్టోవ్ స్కీ. అస్తిత్వంలోనుండి రావలె అవగాహన. కామంనుండి మోక్షకామం, తత్త్వంనుండి కాదు.

లీజా(Lisa):

జ్వెర్కోవ్ ను అవమానించి అతడితో  గొడవపడాలని, సిమనోవ్ దగ్గర సిగ్గులేకుండా వాడు ఛీదరించుకొని విసిరికొట్టిన డబ్బు తీసుకొని వేశ్యాగృహానికి వెళతాడు. అప్పటికి తన మిత్రబృందం వారి పని ముగించుకొని వెళ్ళిపోయారు. ఇతడు మహా కసితో ఉన్నాడు. అప్పుడు ఆ వేశ్యాగృహంలో, అడుక్కుని తెచ్చుకున్న డబ్బుతో, లీజా (Lisa) అని ఒక ఆమెతో ఆ రాత్రి గడుపుతాడు.అతడికి అది  ఒక నీచస్థలమని  తాను చాలా  ఉన్నవాడు ఉన్నతుడు సంస్కారవంతుడు అన్న ఆధిక్యభావం ఆవేశించి, మిగిలిన రాత్రంతా తానొక ఆదర్శవంతుడిపాత్రను ఆమె వద్ద అభినయిస్తాడు. ఆ లీజాకు సుదీర్ఘమైన ఉపన్యాసం యిస్తాడు, 'ఏమిటి యీ బతుకు, ఇదీ ఒక బతుకేనా, యిలా ఎన్నాళ్ళు యీ వృత్తిలో సంపాదించగలననుకొంటున్నావు, త్వరగా ముసలిదానివై పోతావు, అప్పుడు నీ ముఖం ఎవరు చూస్తారు, ఈ నీచమైన బతుకులోనుండి బయటపడు', అంటూ ధార్మికబోధ చేస్తాడు. ఆమె యిటువంటి ఉపన్యాసాలు చాలానే విన్నది, తన దగ్గరకు వచ్చే వారి నుండి. కాని కొంత సేపటికి ఇతని మాటలు ఆమెను పశ్చాత్తాపంతో నింపి వేశాయి. తన బతుకుపై  అసహ్యం వేసి దు:ఖంతో కుంగిపోయింది. తల దించుకొని అతడి చేతిని తన చేతిలోకి తీసుకుని కూర్చుంది. అతడు, సారీ చెప్పి, బాధ పడకు అంటూ తన అడ్రసు కార్డు యిచ్చి 'ఎప్పుడైనా  రా'  అని వెళ్ళి పోయాడు.
       
ఇంటికి వెళ్లిన తరువాత, అతడికి ఆమె నిజంగా వస్తుందేమోనని భయం. ఆమెకు తన గురించి  గొప్ప యిమెజ్ యిచ్చుకున్నాడు. ఆమె తనను యిక్కడ చూస్తే, ఈ చెత్త యిల్లు, యీ పాత రూము, తనను ఏ మాత్రము లక్ష్యం చేయని తన పని వాడు ( వాడికి ఏ నాడు తను జీతం సరిగా యివ్వలేడు,). కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆమె రాలేదు. అమ్మయ్య, అనుకున్నాడు. ఇక రాదులే అనుకొంటుండగా , ఒక రోజు లీజా వచ్చింది. తను బాత్ రూము డ్రెస్ లో ఉన్నాడు. ఇల్లు, అది యిల్లా!ఈ పని వాడు! ఏనాడు ఒక్కమాట మర్యాదగా మాట్లాడడు. ఇద్దరిలో పనివాడు ఎవరు అన్న అనుమానం వస్తుంది ఎవరికైనా.తనమీద తనకు విపరీతమైన అసహ్యం కలిగింది.  లీజా మీద విపరీతమైన కోపం వచ్చింది.' బుద్ధి చెప్పాలి', అనుకున్నాడు. ఆమెతో చాలా అసహ్యంగా ప్రవర్తించాడు. ఆమెకు పరిస్థితి అర్థమైంది. అతని స్థితిని అర్థం చేసుకుంది. ఆమెకు కోపం రాలేదు. మనసు ఆర్ద్రమైంది. అతనికి దగ్గరైంది. అతడు  ఆ అవకాశాన్ని అప్పుడుకూడా  వదులుకోలేదు. కాని మళ్ళీ ఆమెను అసహ్యించుకొని వెళ్ళిపో అన్నాడు. ఆమె వెళ్ళిపోతుంటే ఆమె చేతినిలాక్కుని  అందులో డబ్బు ఉంచాడు, ఆమెను యింకా అవమానించడానికి. ఆమె వెళ్ళిపోయింది. అతడు తప్పు చేశాననుకుంటాడు. అతడు యీ విధంగా ప్రవర్తించడం మనసు ఒప్పుకోవడం లేదు.' లీజా లీజా అని పిలుస్తాడు. ఆమె తలుపు దభీమని మూయడం వినిపించింది. టేబుల్ మీద ఆమె నలిపి పడేసిన కరెన్సీనోటు కనిపిస్తుంది. వీధిలోకి  వెళుతాడు,  ఆమెను కలిసి క్షమించమని అడగుదామని. ఆమె వెళ్ళిపోయింది. ఇంటికి తిరిగి వచ్చి, 'మంచిదయింది, ఆమె వెళ్ళి పోయింది', అనుకుంటాడు. తను ప్రేమించలేడు. లీజా అది గ్రహించి వెళ్ళిపోయింది.
   
లీజా తనను తన పేదరికాన్ని  తన మనస్సంఘర్షణను తన బలహీనతను అన్నిటిని బేషరతుగా స్వీకరించడానికి సిద్ధమయింది. ఆమె ప్రేమించగలదు. అతడు ప్రేమకలలు  మాత్రమే కనగలడు.  తను కలలుకన్న  స్వర్గం ( sublime and beautiful) నడిచివచ్చి తన గడప ముందు నిలబడితే, అతడు కాలితో తోసిపడేశాడు. ఆ "పతిత"  ప్రేమౌన్నత్యం ముందు  అతడు  పాతాళానికి పడిపోయాడు. ఆదర్శాలమేడలు కట్టడం వేరు, వాటిలో జీవించగలగడం వేరు.
       
 నాచ్ గర్ల్స్ సముద్ధరణ, విధవావివాహాలు అంటూ ఉపన్యాసాలు దంచే  కన్యాశుల్కంలో గిరీశం మనకు తెలుసు. కాని గిరీశంలో  సంఘర్షణ లేదు.పాత్రలో సంక్లిష్టత లేదు.  ఈ డోస్టోవ్ స్కీ నవలలో  ప్రతినాయకుడికి  తన అల్పత్వం తనకు తెలుసు.తెలుసు కనుక,తనపై తనకు అసహ్యం, కోపం.వాటిని లోకంపైకి తిప్పుతాడు. తనను తాను అవమానానికి గురిచేసుకుంటాడు.తనకు తాను హాని కలిగించు కోవలననుకుంటాడు. పశ్చాత్తాపపడతాడు.కాని అంతకు మించి ఏమీ చేయలేడు.
ఈ కథానాయకుడిపాత్రద్వారా డోస్టోవ్ స్కీ ఏం చెబుతున్నాడు? ఆ పాత్ర ఆత్మవంచన చెబుతున్నాడా? అదేమంత విశేషపాత్రచిత్రణ? కాల్పనిక ఆదర్శాలకు ( రొమాంటిక్ ఐడియలిజమ్), మనిషి బతుకుతున్న వాస్తవానికి మధ్య ఉన్న సహజమైన అంతరం చెబుతున్నాడా? రెంటినీ కలపడం అవసరం అంటున్నాడా? ఫ్రెంచి జర్మన్ కాల్పనికవాదానికి రష్యన్ కాల్పనికవాదానికి మధ్య ఉన్న తేడాను చెబుతున్నాడు. యూరపియన్ కాల్పనికత వాస్తవాన్ని వదిలేస్తుందని, రష్యన్ కాల్పనికత ఆదర్శాన్ని వాస్తవంతో కలుపగలదని డోస్టోవ్ స్కీ భావం. ఊహల ఆకాశంలో కాక, ఉదాత్తతను సౌందర్యాన్ని  నేలమీద నడిపించడం రష్యన్లకు స్వభావసిద్ధమని, యిది యూరపియన్ ప్రభావంలో అడుగంటుంతోందని డోస్టోవ్ స్కీ ఆవేదన.

ఈ కథలో కథానాయకుడి అవగుణం భావదారిద్ర్యం కాదు, దారిద్ర్యభావం.అతడు తన పేదతనానన్ని సహజంగా స్వీకరించగలిగితే, లీజా అతన్ని స్వీకరించేది. అతడు అసహ్యించుకొన్నది అతని పేదతనాన్ని మాత్రమే కాదు. పేదతనాన్నే అసహ్యించుకొంటాడు.డబ్బు హోదా సామాజికస్థాయి తప్ప అతడు మనిషిని ప్రేమించలేడు. అతనిది పుస్తకపు బతుకు.చదువుకునే రోజుల్లో , యితరులను తక్కువచేయడానికి ఎక్కువ మార్కులు తెచ్చుకునేవాడు.ఇప్పటికీ అతని తత్త్వం అదే. అందుకే మొదటి సారి అతన్ని కలిసినపుడు, లీజా అన్నది, “ పుస్తకంలా మాట్లాడుతావు” అని. మాటే కాదు, అతడు పుస్తకంలోనే బతకగలడు. లీజా మట్టిలోనుండి వచ్చిన మనిషి, మట్టిలో బతికే మనిషి. మట్టి అంటకుండా బతకగల మనిషి. ఆమె నలిపి టేబుల్ మీద పడేసిపోయింది కరెన్సీ కాగితాన్ని కాదు, అతడి జీవితపు విలువల్ని.

ఈ నవలలోని పూర్వోత్తరభాగాలను ఉత్తరపూర్వభాగాలుగా అతికించడంలో రచయిత ఏ ప్రయోజనం సాధించాడు?

ఈ రెండవభాగం ముగింపు మరొకసారి చూద్దాం. ఈ కథ ముగిసిన యిరవైసంవత్సరాలతరువాత, మొదటి భాగం (నోట్స్ ) రాసుకున్నాడు. ఈ యిరవై ఏళ్లలో కథానాయకుడు మారాడా? ఎలా మారాడు? ఆ మార్పు వయసును బట్టి వచ్చిందా? యువకుడుగా తన అనుభవం యీ నోట్స్ లో ప్రతిఫలిస్తున్నదా? ఆ కథ ముగింపులో అతడు అల్పుడు నీచుడు. కాని అతనిలో సంఘర్షణ ఉంది. ఆ సంఘర్షణ వయసుతో ఎలా పరిణమించింది? ఏమీ మార్పు లేదా? నలభై ఏళ్ళ వయసులో రాసిన (మొదటిభాగంలోని)  అతని నోట్స్ మనం ఎలా చదవాలి? అది తిక్కవాగుడు కాదు అని తెలుసు.కాని, అతని పుస్తకప్రపంచానికి  వాస్తవప్రపంచానికి మధ్య జరిగే సంఘర్షణలో అతడు నిజాలే చెబుతాడు. రెండవదైన కథాభాగం ప్రారంభించేముందు, మొదటిభాగం ముగింపులోని మాటలు:

“ఈ వేళ ముఖ్యంగా చాలా వెనుకటి  ఒక జ్ఞాపకం నన్ను బాధిస్తోంది.కొన్ని రోజులక్రితం అది చాలా స్పష్టంగా గుర్తొచ్చింది, వదలకుండా వెంటాడుతోంది…దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలి…ఎందుకోగాని నాకనిపిస్తోంది, దాన్ని కాగితంమీద పెడితే అది వదిలిపోతుందని.ప్రయత్నిస్తే తప్పేముంది? …పైగా పనిలేక బోర్ కొడుతోంది.రాయడం కూడా పనే కదా? పని, మనిషిలో కరుణ కలిగిస్తుందని అంటారు. చూస్తా.”[“పని, కనిపించే ప్రేమ”,(జిబ్రాన్) అన్నమాట విన్నాం.]

ఇరవై ఏళ్ళయినా ఆనాడు జరిగింది తాను మరచిపోలేకపోయాడు. పైగా అతన్ని వెంటాడుతోంది.అంటే ఆనాటి అతని హేయమైన ప్రవర్తన,వెతుక్కుంటూవచ్చిన లీజాకు తను చేసిన అవమానము,  అతని గుండెలో గుచ్చుకొనే ఉన్నాయి. అవమానంకూడా జీవితానికి అర్థం కల్పిస్తుంది. లీజాకు తను చేసిన అవమానం ఆమెను ఆమె జీవితకాలమంతా మనిషిగా నిలబెడుతుంది, అని ఆమె గురించి తానన్న మాట తనకూ వర్తిస్తుంది:

“ఆమె తన అవమానానికి నిరసనను శాశ్వతంగా ఉంచుకోవడం మంచిది కదూ?నిరసన ? కాదు, అది ప్రక్షాళన; అది గుచ్చుకొని, తీవ్రంగా బాధిస్తూనే ఉంటుంది..కాని ఆమె అభిమానంతో బతుకుతుంది…కాని, సుఖంగా?ఇక్కడ నేనే ఒక ప్రశ్న అడుగుతాను, పనికిరాని ప్రశ్న. ఏది మేలు, చౌకబారు సుఖమా, ఉదాత్తమైన బాధా? ఏది?”

ఇతన్నికూడా ఆ ఘటన యిన్నాళ్ళూ ఒక  వ్రణంలా బాధిస్తూ శోధిస్తూనే ఉంది.
లీజా ఆనాడు అలా వెళ్ళిపోతున్నపుడు, తను వీధిలోకి, ఒంటిమీద బట్టకూడా సరిగా లేక, ఆతురతతో పరుగెత్తాడు ఆమె కోసం.

“ఎందుకు? ఆమె కోసం ఎందుకిలా పరుగెడుతున్నాను? ఆమె ముందు పడిపోయి, వెక్కివెక్కి ఏడ్చి, ఆమె పాదాలను ముద్దుపెట్టుకొని, క్షమాపణ అడగాలని! నా గుండె ముక్కలుగా కోసినట్టవుతోంది.ఎన్నటికీ, ఎన్నటికీ ఆ క్షణాన్ని ఉద్వేగంలేకుండా గుర్తుచేసుకోలేను.”

వీడు కీటకమే. కాని ఆడుతున్నది నాటకం కాదు. కనుక, నవలలోని మొదటిభాగమైన “ నోట్స్” లోని వ్యంగ్యం ఆ సంఘర్షణతో రంగరించి రాసిన నోట్స్ గానే చదవాలి. సమసిన సంఘర్షణ కాదది. సాగుతున్న సంఘర్షణ.

అప్పటిలాగే యిప్పుడూ అతడు సమాజంతో బతకలేక, “కలుగుల్లో”నే కలలు కంటూ బతుకుతున్నాడు. మనిషి  కలుగులో బతకడానికి అనేక  కారణాలుంటాయి. ఒకటి కీర్క్ గార్డ్ చెప్పిన “మంద అసత్యం”("crowd Is untruth”) హైడెగర్ అదే అంటాడు: “Everyone is the other and no one is himself…Every man is born as many men and dies as a single one.” Being and Time: Heidegger. కనుక, ఆత్మ కలవాడు మందలో బతకలేడు. అతని బతుకు విలువలు వేరు, పరమార్థం వేరు. అతడు లోకం దృష్టిలో వెర్రివాడో, విప్లవకారుడో, సమాజంలో కలవలేని అనర్హుడైన అల్పుడో. కనుక కలుగు అతని ఆవాసం,( alienation). మరొకటి, అతడు తనలోని  వైరుధ్యాలను సమన్వయం చేసుకోలేని మానసికప్రవాసి.(self-exile).లేక, , అతడే చెప్పుకున్నట్టు, అతడికి నిజంగానే “జబ్బు”.లివర్ జబ్బు కాకపోవచ్చు. మానసిక వ్యాధి. అది లేనివాడెవడు యీ కాలంలో? ఈనవలలో యీ అర్థాలన్నీ యిమిడి ఉన్నాయి.అన్నిటికంటే ముఖ్యమైనది, కలుగులోని జీవులు బతుకును గురించి తీవ్రంగా ఆలోచించవు. ఆలోచన (reflection) కాక, ఆర్తి ( passion) వారి బతుకును నడిపిస్తుంది .

రెండవభాగం కథలో మంచు ఎక్కువ. జ్వెర్కోవ్ తో  డిన్నర్ సమయంలో మంచు. అంతకంటే ముఖ్యమైన మరో సన్నివేశం, అవమానంతో వెళ్ళిపోతున్న లీజాను వెతుకుతూ కథానాయకుడు (నవలలో యితడికి పేరులేదు) వీథిలోకి పరుగెత్తినపుడు,  విపరీతమైన మంచుకురుస్తోంది.మొదటిభాగం ముగింపులో యీ మంచే అతనికి ఆ నాటి ఘటనను గుర్తుచేస్తుంది. కథ ఆద్యంతాలలో  హిమపాతం. డోస్టోవ్ స్కీ ఇతడి జీవితం హేమంతకృష్ణానంతశర్వరి అంటున్నాడా? అనడు. కాని,మనిషి జీవితం నిత్యవసంతం అని ఎవడైనా అంటే నమ్మవద్దు అంటున్నాడు. స్ఫటికహర్మ్యాలు(Crystal Palace)  ఆకాశంలో ఉంటాయికాని, నేలమీద ఉండవు. కాల్పనికవాదులు, వికాసవాదులు, విప్లవవాదులు, చివరకు ఆధ్యాత్మికవాదులు, చౌకగా  అమ్ముతున్న కలలు కలలే.("Not just in commerce but in the world of ideas too our age is putting on a veritable clearance sale.Everything can be had so dirt cheap…"Opening sentence of "Fear and Trembling": Kierkegaard) జీవితపరమార్థం దుఃఖస్పర్శలేని సుఖం కాదు, స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛకోసం మనిషి తనకు తాను ఎంత కష్టమైనా నష్చమైనా కలిగించుకుంటాడు.బుద్ధి ఉన్నవాడు, తెలివిగా ఆలోచించగలవాడు, తనకు తాను ఎన్నటికీ హాని కోరడు, అన్న వాదాన్ని డోస్టోవ్ స్కీ యిందులో ఖండిస్తున్నాడు. శిక్ష మనిషిని శిక్షితచిత్తును చేస్తుంది అంటాడు, డోస్టోవ్ స్కీ. ఆ శిక్ష, శిక్షణ బతుకులోనుండి రావలె, బయటనుండి కాదు, యీ నవలలో లీజాకు వలె.

నవల పేరు, అనువాదసమస్యలు:

ఈ నవల పేరు ఆంగ్లంలో "Notes from the Underground ". ( కొందరు "Notes from Underground ",అని కూడా అనువదించారు, "the" లేకుండా.)కాని యిది సరి అయిన అనువాదం కాదంటారు. ఒక కారణం, underground అనగానే, ప్రభుత్వవ్యతిరేక ఉగ్రవాదుల స్థావరం అన్న అర్థస్ఫురణ కలుగుతుంది. ఈ నవలలో అటువంటిదేమీ లేదు. లోకానికి ముఖం చూపించలేక, ఏకాంతంగా అజ్ఞాతంగా బతుకుతున్న ఒకడి కథ ఇది. కనుక, "underground" సరి అయిన పదం కాదు. ఈ పేరుకు అనేకులు అనేకపర్యాయపదాలు సూచించారు. నబకోవ్  "Under the Floor "( podval, basement ,cellar) సూచించాడు. ఇది ఫ్లోర్ కింద విశాలమైన ఖాళీస్థలాన్ని సూచిస్తుంది. అది డోస్టోవ్ స్కీ  ఉద్దేశించింది కాదు. మరి కొన్ని సూచనలు కూడా యిటువంటివే, "Notes from the Cellar ","Notes from the Basement ". రష్యన్ భాషలో ఈ నవల పేరు "Zapiski iz podopol'ya ". డోస్టోవ్ స్కీ  ఉద్దేశించినది, మనుషులు నివసించడానికి యోగ్యం కాని, ఎలుకల వంటివి నివసించే కలుగులు. లేక, భూతప్రేతపిశాచాలు ఉండే ప్రదేశం. మనిషి అంతరాంతరాలలో  తనకే తెలియక దాగి ఉండే  ఆలోచనలకు ప్రతీకలు. ఈ అర్థంలో నవలకు సరి అయిన పేరు " Notes from Under the Floorboards". ఇది చెక్కఫ్లోరింగ్ కింద కాపురం ఉండే కీటకాలు, అన్న అర్థం స్ఫురింప చేయ గలుగుతుంది. “నేను ఒక కీటకంగా మారి పోవడానికి తీవ్రప్రయత్నం చేశాను. కాని కాలేక పోయాను”,అంటాడు కదా యిందులోని కథానాయకుడు!

                                               ******


                                2. పాపము  ప్రక్షాళనము
      (The Brothers Karamazov (1880) లో అంతర్భాగమైన ఒక కథ)

ఆయన మా టౌన్లో పెద్ద అధికారి.చాలాకాలంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. సంపన్నుడు. ఉదారుడు.ఊళ్ళోని అనాథశరణాలయాలకూ ఉచితాన్నదానసంస్థలకూ విరివిగా విరాళాలు యిచ్చేవాడు. అతడంటే అందరికీ గౌరవం.దయాగుణం కలవాడు.అవసరంలో అనేకులను ఆదుకున్నాడు.(ఆయన దయాగుణం ఆయన పోయిన తరువాతనే తెలిసింది.) ఏభై ఏళ్ళుండవచ్చు.భార్య, ముగ్గురు పిల్లలు. ఒకరోజు సాయంత్రం హఠాత్తుగా తలుపు తోసుకుని నా గదిలోకి వచ్చాడు.   ఎందుకొచ్చాడో తెలియదు. గంభీరంగా ఉన్నాడు. ముఖంలో ఒక తీవ్రత కనిపిస్తోంది.కూర్చుంటూ అన్నాడు:
'ఈ మధ్య మీరు ఈ టౌన్లో తిరుగుతూ, కొందరి యిళ్ళకు వెళ్లడం, వారితో వాళ్ళ కష్టసుఖాలు మాట్లాడడం చూస్తున్నాను. మీరు వాళ్ళకు చెపుతున్న మాటలు వింటున్నాను కూడా. మీరు సామాన్యవ్యక్తి అనిపించడం లేదు.  మీది దృఢమైన ధార్మికప్రవృత్తి. మీలో సత్యనిష్ఠ  కనిపిస్తున్నది.మీరు చేస్తున్న పని అందరూ చేయగలిగింది కాదు. పరువు నష్టమనీ, నలుగురూ చులకన చేస్తారనీ తెలిసి కూడా, మీరు చేయదలచుకున్నది చేసేస్తారు.అలా చేయడానికి చాలా ధృతి ఉండాలి'.

'అదేం లేదండీ. మీరంటున్నంత గొప్ప విషయమేమీ కాదది.నన్ను ఎక్కువగా పొగుడుతున్నారు', అన్నాను.
     
ఇక్కడ నా గురించి కొంత చెప్పుకోవాలేమో? నేను నిన్నమొన్నటిదాకా ఒక ఆర్మీ ఆఫీసర్ని.నేను ఒకప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెను మరొకడు సొంతం చేసుకున్నాడు.నాకు వాడిమీద విపరీతమైన కోపం వచ్చింది. 'బలాబలాలు తేల్చుకుందాం రా' , అని వాణ్ని ఛాలెంజ్ చేశాను.మర్నాడు ఉదయాన్నే ఊరి చివర కలుసుకుందాం అనుకున్నాం.ఆ రాత్రి సరిగా నిద్రపోలేకపోయాను. తెల్లవారితే ప్రేమప్రత్యర్థితో జరగబోయే బలపరీక్ష గురించి  చాలా సేపు ఆలోచించాను.నన్ను ప్రేమించని అమ్మాయికొరకు పోట్లాట ఏమిటి? పైగా ఒక వేళ నేను అతన్ని చంపాననుకో? ఏం చేసినట్టు? ఆమె జీవితాన్ని దు:ఖమయం చేయడమే కదా? అలాజరుగకూడదనుకున్నాను.తెల్లారింది. నేను నా ప్రత్యర్థి కలుసుకుందామనుకున్న చోటికి చేరాం. రాత్రి నిర్ణయించుకున్నట్లే అతనితో నేను పోటీనుండి విరమించుకుంటున్నాను అని చెప్పేశాను. క్షమించమనికూడా అన్నాను. ఆ సందర్భంలో అవతల వ్యక్తి నన్ను ఎంత నీచంగా అవహేళన చేస్తాడో తెలుసు. అందులో, నేనొక ఆర్మీ ఆఫీసర్ని కూడా.ఆర్మీలో కూడా యిటువంటి పిరికిమనుషులుంటారా అని అతడే కాదు బయటకూడా నన్ను  అవహేళనచేస్తారు. అయినా అనుకున్నది చేసేశాను. ఇది జరిగిన తరువాత నాకు సైన్యంలో పనిచేయాలనిపించలేదు. రాజీనామా చేశాను. ఇప్పుడీ పెద్దమనిషి నాగురించి అంటున్న మహత్కార్యం  ఆనాడు నా ప్రేమప్రత్యర్థిని నేను క్షమించమని అడగడం గురించే .
     
'లేదు.లేదు.ఎక్కువ ఏమాత్రము కాదు.మీరు చేసిన పని చేయగలగడానికి చాలా చాలా మనోబలం కావాలి.మీరనుకున్నంత తేలికేమీ కాదు. నిజానికి నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చింది ఆ బలమే. చూడండి, మిమ్మల్లి విసిగిస్తున్నానేమో?  మీ వ్యక్తిగత విషయంలోకి తలదూరుస్తున్నాను అనుకొంటారేమో కాని, మిమ్మల్ని ఒకటి అడగాలని ఉంది.ఆనాడు అతన్ని మీరు క్షమించమన్నప్పుడు  మీ మనస్స్థితి ఎటువంటిదో , మీ మనసులో ఏ భావాలు కలిగాయో చెప్పగలరా? ఈ విధంగా అడగడంలో నాదొక రహస్యప్రయోజనం ఉంది. దాని గురించి తరువాత సమయం వచ్చినపుడు,మనం యింకా దగ్గరవడం భగవంతుడి సంకల్పమైతే, చెబుతాను', అన్నాడు.
     
'అప్పటి నా మనస్థితి ఏమిటి అని అడుగుతున్నారు.ఇక్కడ, నేను ఇంతవరకు ఎక్కడా చెప్పని విషయం  ఒకటి మీకు చెప్పాలి. నా ప్రత్యర్థిని ఛాలెంజ్ చేసి వచ్చిన ఆ రాత్రి జరిగిన ఒక సంఘటన నా జీవితాన్ని మార్చేసింది. అది నా జీవితంలో నేను ఊహించి ఉండలేని గొప్ప మలుపు.అతణ్ణి ఛాలెంజ్ చేసి  యింటికి వచ్చానా? ఆ సాయంత్రం అంతా కోపంతో ఊగిపోయాను. ఉన్నట్టుండి అకారణంగా,  నాదగ్గర పనిచేసేవాణ్ణి  ముఖంమీద రెండు గుద్దులు గుద్దాను. వాడి ముఖమంతా  రక్తం. నిశ్చేష్టుడై నిలబడి పోయాడు వాడు. ఆ రాత్రి నాకు సరిగా  నిద్ర పట్టలేదు. పక్కమీదినుంచి లేచి పోయాను. మనసంతా అలజడి. నా పనివాణ్ణి కొట్టడమేమిటి? వాడు నా లాంటి మనిషే కదా? పాపం, కొడుతుంటే, వాడు చేయి కూడా ఎత్తలేదు.కవాతులో నిలుచున్న సైనికుడిలా కదలకుండా ఉండిపోయాడు. నా మీద నాకే అసహ్యం వేసింది.  నేను చేసిన పని తప్పు అని తెలుసుకున్నాను.తెల్లవారగానే  వాడి  కాళ్లమీద పడి  క్షమించమన్నాను.వాడికి చాలా ఆశ్చర్యం కలిగివుంటుంది.  వాడు చాలా యిబ్బంది పడిపోయాడు. నాకు మతిచెడిందేమోనని అనుమానించినా అనుమానించి ఉండవచ్చు. కాని నా మనసులో అలజడి ఆగిపోయి తేలికపడింది. ఆ తరువాత  నా  ప్రత్యర్థిని క్షమించమని అడగడం నాకు సులభం అయింది. ముందే దారి చేసుకుని ఉన్నాను కనుక. దారి చేసుకుని మొదటి అడుగు వేయడంలోనే ఉన్న కష్టమంతా. తరువాత  దారి సులభం. నా ప్రత్యర్థితో అలా ప్రవర్తించడంలో అవమానం కాదు, ఆనందం ఉండింది', అన్నాను.
   
నేను యిదంతా చెబుతున్నపుడు అతడు నావైపు ఎంతో ఆసక్తితో విన్నాడు. ' మీరు మాట్లాడడం వినడం చాలా బాగుంది. అప్పుడప్పుడూ వస్తుంటాను', అని వెళ్ళిపోయాడు.
     
అప్పటినుండి అతడు ఇంచుమించు ప్రతిరోజు సాయంత్రం నన్ను కలవడానికి వచ్చేవాడు. మేము యింకా చాలా దగ్గరి స్నేహితులం అయ్యేవాళ్ళమే. కాని అతడు తనగురించి ఏమీ మాట్లాడేవాడు కాదు. నాగురించి అడుగుతూ ఉండేవాడు. శ్రద్ధగా వినేవాడు. అయినా అతడంటే నాకు యిష్టంగానే ఉండేది.  నా గురించి నేను చాలా మనసు విప్పి మాట్లాడేవాణ్ణి. అతని జీవితరహస్యాలు నాతో చెప్పుకోవలె అని నేనెందుకనుకోవాలి? అతని మంచితనం సరళస్వభావం స్పష్టంగా తెలుస్తున్నాయి.పైగా, నాకంటే వయసులో హోదాలో  పెద్దవాడు.అయినా, సమవయస్కుడితో లాగా పెద్దరికం  చూపకుండా మాట్లాడుతున్నాడు. ఎక్కువ విన్నది అతడైనా, ఎక్కువ నేర్చుకున్నది నేను. అతడు ఉదాత్తుడు. అతడు నేలమీద నడుస్తున్నా, అతని తల స్వర్గంలో ఉన్నది అనిపించేది.
   
ఒకరోజు అన్నాడు, హఠాత్తుగా: 'ఆ జీవితం ఉందే, అది , అది స్వర్గం. దాన్ని గురించే ఆలోచిస్తుంటాను. నిజానికి అది  తప్ప మరోవిషయం గురించి ఆలోచించడం లేదు.' అంటూ, నా వైపు చూచి చిన్నగా నవ్వాడు. 'నీకంటే దానిపై  నాకు ఎక్కువ నమ్మకం. ఎందుకంటున్నానో తరువాత చెబుతాను.'

అతడేదో చెప్పాలనుకుంటున్నాడనిపించింది.

‘దివ్యలోకం దాగి ఉంది. ఎక్కడో కాదు, మనలో. ఇక్కడ, ఇప్పుడు. ఈ క్షణం నాలో ఉంది.నా గుండెలో. నేను సంకల్పిస్తే ,రేపు అవతరిస్తుంది,శాశ్వతంగా .'

నేను అతని వైపే చూస్తూ ఉండిపోయాను.అతడు చాలా ఉద్రేకంతో మాట్లాడుతున్నాడు.
'అవును. నీవంటూ ఉంటావే, అదినిజం. మనం మన కర్మలకే కాదు, లోకంలో అందరి కర్మలకు అందరి పాపపుణ్యాలకు  బాధ్యులం.ఈ సత్యం, దాని బహుముఖప్రాధాన్యం ఇంత చిన్న వయసులో నీవు తెలుసుకోగలగడం ఆశ్చర్యం. ఇది తెలిసిన మరుక్షణం అప్పటివరకు కలగా ఉండిపోయిన ఆ దివ్యలోకం దిగివస్తుంది.'

'ఎప్పుడు అది వచ్చేది? అసలు వస్తుందా?', అన్నాను, కొంత అపనమ్మకంతో , కొంత అసహనంతో.

'అంటే నీవు నమ్మవన్న మాట? నీవు నలుగురికీ నమ్మకం కలిగిస్తావు, కాని నీకు నమ్మకంలేదు? విను.తప్పక వస్తుంది.కాని వచ్చే ముందు  ఈ వెలివేత , ఈ భయంకరమైన ఒంటరితనం తప్పదు.
'
'వెలివేతా? ఏ వెలివేత?'

‘మనిషి మనిషిని వెలివేయడం. మనిషి మనిషితో కలిసి బతకలేకపోవడం. వెలిగా వెలితిగా బతకడం.లోకమేమైపోయినా సరే, నేనుబాగుంటే చాలు అనుకోడం.'
   
అతడు నన్ను   కలవడానికి రావడం ఎక్కువయింది.నేనూ అతడి రాక కోసం ఎదురు చూసేవాడిని. అతడేదో  ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకొనే విషయంలో  తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు  అనిపించేది. నేను ఆ విషయంలో ఏమీ ఆరాలు తీయవలెనని ప్రయత్నం చేయకపోవడం అతడికి నచ్చింది.కాని  అతడు ఎప్పటికప్పుడు  నాతో ఏదో చెప్పాలనే అనుకుంటున్నట్టు అనిపించేది నాకు.  
     
ఒక రోజు అన్నాడు,'నీకు తెలుసా?  మన సమావేశాలగురించి ఊళ్ళో వాళ్ళు చాలా మాట్లాడుకుంటున్నారు.  మనం యింత తరచుగా ఎందుకు కలుస్తున్నామో ఏం మాట్లాడుకుంటున్నామో తెలుసుకోవలెనని చాలా కుతూహలంతో ఉన్నారు.ఉండనీ.ఉండనీ.సమయం వచ్చినపుడు తెలుస్తుంది.'

     
మాట్లాడుతూ మాట్లాడుతూ  ఒక్కోసారి అతడు ఉన్నట్టుండి  ఉద్విగ్నుడయేవాడు. అట్లాంటి సమయాలలో హఠాత్తుగా లేచి వెళ్ళిపోయేవాడు. ఒక్కోసారి నా కేసి తీక్షంగా చూస్తూ ఉండిపోయేవాడు. అటువంటపుడు అనిపించేది,' ఇప్పుడేదో చెప్పబోతున్నాడని.వెంటనే ఏదో పిచ్చాపాటీలోకి దిగిపోయేవాడు. చాలాసార్లు అతడికి విపరీతమైన తలనొప్పి వచ్చేది.
   
ఒక రోజు చాలాసేపు ఏవో విషయాలు ఉద్రేకంతో మాట్లాడుతూ ఉన్నాడు.ఉన్నట్టుండి అతడి ముఖం వివర్ణమయింది. మూర్ఛవచ్చే వాడికి లాగా ఒళ్ళు, ముఖం వణుకుతున్నాయి. నావైపు చూస్తాడు,చూపుపక్కకు తిప్పుకుంటాడు.మళ్ళీ చూస్తాడు.

'ఏమయింది? ఎలాఉంది?' అన్నాను.

‘నేను...నేను ...నీకు తెలుసా? నేనొకరిని హత్య చేశాను’, అంటూ ఒక పేలవమైన నవ్వు నవ్వాడు.
అతడన్న మాటకు నిర్ఘాంతపోయాను.కాని ఆ మాట దాని అర్థం నా తలకెక్కే లోపల అతడి నవ్వు నన్ను పట్టుకుంది.  నవ్వడమేమిటి? ఎందుకు నవ్వుతున్నాడు?

' ఏమన్నావ్?', అరిచాను.

'చూశావా,ఆ మాట నానుండి బయటపడడానికి ఎంత కష్టపడ్డానో! ఇప్పుడు చెప్పేశాను. మొదటి అడుగు వేశాను. ఇక నడిచేస్తాను', అన్నాడు.

వినగానే  నేను నమ్మలేదు.ఆ తరువాత కూడా చాలాసేపు నమ్మలేదు నేను. ఆ తరువాత వరుసగా మూడు రోజులు వచ్చాడు.జరిగిందిచెప్పాడు. అతడికి మతి చలించిందేమో అనుకున్నాను.కాని నమ్మక తప్పలేదు. అతడు చేసింది చాలా ఘోరమైన నేరం.
   
పధ్నాలుగు సంవత్సరాల క్రితం అతడు ఒక స్త్రీని హత్యచేశాడు.ఆమె భర్త చనిపోయాడు. బాగా ఉన్నవారు. పెద్ద యిల్లు. తోట. ఆమె అందంగా ఉండేది. వయసులో ఉన్నది. ఇతడు ఆమెను గాఢంగా ప్రేమించాడు.  తన ప్రేమను ఆమెకు చెప్పుకున్నాడు. పెళ్లికి ఆమెను ఒప్పించాలని ప్రయత్నం చేశాడు.కాని ఆమె అంతకు ముందే మనసు మరొకరికిచ్చేసింది.పెళ్ళి కూడా నిశ్చయం అయింది. ఆమె వరుడు సైన్యంలో పెద్ద పదవిలో ఉన్నవాడు.దూరప్రాంతంలో సేవలో ఉన్నాడు. త్వరలో వచ్చి ఆమెను వివాహం చేసుకోబోతున్నాడు.ఇతడి ప్రేమను స్వీకరించలేనని చెప్పి, దయచేసి తనను కలుసుకోడానికి రావద్దని చెప్పింది.ఆమెను కలవడం మానేశాడు.కాని యిల్లు, యింటితోట, ముందు ద్వారం, వెనుకవైపు దారి అన్నీ బాగా తెలుసు అతనికి. ఒక రాత్రి చాలా సాహసం చేశాడు. యింటివెనుక తోటలోనుండి వచ్చి , వెనుక తలుపు తీసిఉండడం గమనించి, ఆమె గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె ఒక్కతే ఉంది గదిలో, పక్కపై ఒత్తిగిలి పడుకుని. ఆమెను చూడగానే అతడి కోరిక ఉవ్వెత్తుగా ఎగిసింది.అసూయ రేగింది. కోపం తాచులా తలెత్తింది.ఉన్మత్తుడిలా చేతిలో కత్తి ఆమె గుండెలో  కసక్కని దింపాడు. ఆమె అరవనుకూడా లేదు.ఆమె ప్రాణం పోయింది. అతడు దయ్యపు సాహసము,పిశాచపు తెలివి ప్రదర్శించాడు. డబ్బుకోసం చేసిన హత్యలాగా కనిపించడం కోసం, ఆమె పర్సులో డబ్బు తీసాడు .ఆమె దిండుకింద ఉండిన తాళపుచెవులు తీసుకొని బీరువాలు తెరిచి వాటిలో పెద్ద పెద్ద నగలు తీసుకున్నాడు. చిన్నవి చాలానే ఉండినవి. కాని, వదిలేశాడు.ఆస్తుల పత్రాలు తాకలేదు. ఈ పత్రాల విలువ తెలియని చదువురాని వెధవలెవరో దొంగతనం చేసిఉంటారన్న అనుమానం కలగాలి.ఇవన్నీ భ్రమ కలిగించడానికి.ఇవి కాక, తనకు కావలసిన తనకు మాత్రమే విలువగలిగిన వస్తువులు,  కొన్ని తీసుకున్నాడు. వచ్చినదారినే వెళ్లి పోయాడు.
   
మర్నాడు కాని ఆతరువాత కాని ఎన్నడూ   యితనిమీద ఎవరికీ యింతవరకూ కలలోకూడా అనుమానం కలగలేదు.అతడి ప్రేమ విషయం కూడా ఎవ్వరికీ తెలియదు.ఎందుకంటే, అతడు ఎప్పుడూ ఎవరితోను కలిసేవాడు కాదు. మనసు విప్పి మాట్లాడుకునే మిత్రులూ ఎవరూ లేరు. హత్యచేయబడిన  స్త్రీ దగ్గర పనిచేసే వాడి ప్రవర్తన సరిగా లేకుంటే, హత్యకు రెండు రోజులు ముందు ఆమె పనిలోనుండి తీసేసింది. అందరూ ఈ హత్య వాడి పనే అనుకున్నారు. మర్నాడు వాడు ఊరి చివర తప్పతాగి ఒళ్ళు తెలియని స్థితిలో పడి ఉండినాడు. వాడి జేబులో ఒక కత్తి కూడా దొరికింది. వాడి కుడిచేతిన నెత్తురుమరకలుండినాయి.ఏమిటి యీ రక్తం అంటే,  రెండు రోజులనుండి ముక్కున రక్తం కారుతూ ఉండింది అన్నాడు. వాడి కథ ఎవరూ నమ్మలేదు.అరెస్టు చేశారు.ప్రాథమిక  విచారణలో  హత్య అతడే చేశాడని నిర్ధారణ అయింది.ఈ లోపల అతడికి జబ్బుచేసి హాస్పిటల్లో చేర్చారు. మూడో రోజు చనిపోయాడు.కేసు మూసేశారు.

అప్పుడు శిక్ష మొదలైంది.

నా మిత్రుడు ( అవును,  ఇప్పుడు ఆ పెద్దాయన నాకు చాలా దగ్గరైనాడు) అన్నాడు:
'ఇది జరిగిన తరువాత కొన్నాళ్ళవరకు నా అంతరాత్మ నాతో ఏమీ గొడవపడలేదు. బాధ పడ్డాను.కాని ఎందుకు? నేను ప్రేమించిన మనిషిని చంపుకున్నందుకు.ఆమెపై ప్రేమ నా నరాలలో యింకా ప్రవహిస్తూనే ఉండింది. నేను  చంపుకున్నది నా ప్రేమను. కాని నేను ప్రేమించిన మనిషి మరొకరికి భార్య అయితే నేను సహించగలనా? చంపకుండా ఎలా ఉండగలను? ఇక ఆ అమాయకుడి విషయమా? అతడు అరెస్ట్ అయినప్పుడు కొంచెం ఆందోళనచెందాను. అతడి అనారోగ్యం ,ఆ తరువాత అతడు త్వరలో చనిపోవడంతో ఆ ఆందోళన కూడా సమసిపోయింది. అతడు జబ్బు పడడానికి చనిపోవడానికి అతడి అరెస్టు కారణం కాదు అని కూడా నిర్ధారణ చేశారు. అతడికి అంతకు ముందే ఏదో జబ్బు ఉండింది.ఎలాగూ పోయేవాడే.ఇక నేను తెచ్చేసుకున్న డబ్బు, నగలు. నేనేమీ డబ్బుకు కక్కుర్తి పడి దొంగిలించలేదు. హత్యను దొంగతనంలో భాగంగా విచారణను పక్కదోవ పట్టించడానికి చేశాను. దొంగిలించిన సొమ్ము స్వల్పమే. ఆ సొమ్ము మొత్తం వెంటనే శరణాలయాలకు దానం చేశాను. కనుక చాలాకాలం వరకు నా అంతరాత్మ నన్నేమీ యిబ్బంది పెట్టలేదు.ఎటువంటి అశాంతి లేకుండా చాలాకాలం గడిచిపోయింది.ఆ తరువాత ఒక స్వచ్ఛందసేవాసంస్థలో చేరి సేవచేశాను. అంటే, కాయకర్మ. ఇలాంటిపనులలో గతాన్ని యించుమించు మరచిపోయాను. అప్పుడప్పుడూ అది గుర్తొచ్చేది. కాని తోసెయ్యడానికి ప్రయత్నించేవాణ్ణి. ధర్మకార్యాలలో ఎక్కువ చురుకుగా పాల్గొనేవాణ్ణి. ఎన్నో సంస్థలు స్థాపించి పట్టణాభివృద్ధికి చేయగలిగిందంతా చేశాను. చాలా సంస్థలకార్యవర్గాలలో సభ్యుడిగా ఎన్నుకున్నారు నన్ను.ఇలా ఎన్ని చేసినా ఎన్ని పనులలో మునిగి తేలుతున్నా , గతం గుర్తుకురావడం మానలేదు. దాన్ని తోసెయ్యడం అంతకంతకూ కష్టమయింది.ఆ స్థితిలో ఒక అమ్మాయిని చూచాను. తెలివైన మనిషి. పరిచయమైన కొద్ది రోజులలోనే ఆమెను పెళ్ళి చేసుకున్నాను. సంసారంలో భార్యాపిల్లలపట్ల  బాధ్యతలలో గతం మరచిపోవచ్చనుకున్నాను.కాని నా స్థితి యింకా హీనమయింది. నా భార్యకు నేనంటే అమితప్రేమ. నేనొక హంతకుణ్ణి అని తెలిస్తే? ఆమె నాతో మొదటిసారి మనకో బిడ్డ కలగబోతున్నాడు అన్నప్పుడు నేను కలవరపడ్డాను. ప్రాణం తీసిన నేను,  నా ప్రాణం పోసుకుంటున్నవాడికి నా ముఖం ఎట్లా చూపించను? ఒకరి తర్వాత ఒకరు, ముగ్గురు పిల్లలు కలిగారు. వారిని ఎలా ప్రేమిస్తాను? ఎలా విద్యాబుద్ధులు చెప్పిస్తాను? మంచి గురించి, మానవత్వం గురించి వాళ్ళకు  ఏం చెబుతాను, రక్తం చిందించినవాణ్ణి? ఎంత ముద్దొచ్చే పిల్లలు!  దగ్గరకు తీసుకోవాలని, ముద్దుచేయాలని. కాని  ఆ అమాయకపు ముఖాలలోకి చూచే యోగ్యత నాకు లేదు.
       
'రాను రాను నేను చిందించిన రక్తం నన్ను భయంకరంగా వెంటాడడం మొదలుపెట్టింది. ఒక యవ్వనవతి నిండుప్రాణాలు తీశాను. ఆ రక్తం ప్రతీకారం కోరుతోంది.భయంకరమైన కలలు. గుండెనిబ్బరం కలవాణ్ణి కనుక తట్టుకున్నాను. ఈ రహస్యనరకం నా  పాపాన్ని  ప్రక్షాళనం చేస్తుందేమో? కాని అది కూడా జరగలేదు. పోను పోను పరిస్థితి దుర్భరమయింది.
   
'నా ఔదార్యం,నా దానధర్మాలు, వీటి కారణంగా సమాజంలో నాకొక స్థానం ఉంది.అందరూ గౌరవం చూపేవారు. వాళ్ళు ఎంత ఎక్కువ గౌరవం  చూపితే నాకు అంత దుర్భరంగా ఉండేది. ఆ గౌరవానికి నేను అర్హుణ్ణి కాదని నాకు మాత్రమే తెలుసు. అప్పుడప్పుడూ చచ్చిపోదామనుకునే  వాణ్ణి. ఆ ఆలోచనరాగానే, దాని వెంటనే ఇంకో ఆలోచన వచ్చేది. బయటికి వెళ్ళి అందరినీ పిలిచి ' నేనొక హత్య చేశాను' అని చెప్పేస్తే?అప్పుడప్పుడూ కల కూడా వచ్చేది, అలా చెప్పినట్టు.  ఈ ఆలోచనలు, రకరకాల రూపాలలో,  దాదాపు మూడు సంవత్సరాలు వెంటపడ్డాయి. చివరకు అనుకున్నాను.ఒక్కసారి చేసినపాపం చెప్పేస్తే , ఇక ఆ పై ప్రశాంతంగా ఉండవచ్చు, అని.అనుకోడం సులభమే. కాని నేరం ఒప్పుకోడం? వణికిపోయాను.
   
‘ఈ స్థితిలో, నీ ప్రేమఛాలెంజ్ ఉదంతం. అక్కడ జరిగింది చూశాక, ఒక నిశ్చయానికి వచ్చేశాను', అని ఆగిపోయాడు.

‘అంత చిన్న సంఘటన ఇంత పెద్ద నిర్ణయానికి కారణం కాగలుగుతుందా?' అన్నాను.
     
‘నా నిర్ణయం గత మూడు సంవత్సరాలుగా పెరుగుతూ ఉండింది. నీ కథ దానికి ముగింపుమాత్రమే యిచ్చింది.నిన్ను చూసి నన్ను  నేను నిందించుకున్నాను. అసూయపడ్డాను'.ఈ మాటలంటున్నపుడు అతడి ముఖంలో చిరుకోపం కనిపించింది.
   
‘కాని, నీవు ఇప్పుడు నిజం చెప్పినా ఎవడూ నమ్మడు. పధ్నాలుగేళ్ళనాటి మాట', అన్నాను.

‘నా దగ్గర ఆధారాలున్నాయి.బలమైన ఆధారాలు. అవి చూపిస్తాను', అన్నాడు.
అమాంతంగా లేచి అతణ్ణి ఆలింగనం చేసుకున్నాను.

‘ఒక్కటి చెప్పు. ఒక్కటి', అన్నాడు, ఏదో అంతా నా మీదనే ఆధారపడినట్టు. ' అలా చేస్తే నా భార్య , నా పిల్లలు ?  నా భార్య కుంగి కుంగి కృశించి చచ్చిపోతుంది.నా పిల్లలు, వాళ్ళ ఆస్తులు అంతస్తు అలాగే ఉంటాయి. కాని, వారు ఒక హంతకుడి బిడ్డలుగా బతకవలసిందే కదా, జీవితమంతా? వాళ్ళ మనసులలో   నా గురించి ఎటువంటి ముద్ర వేసిపోతాను?'

నేనేం పలకలేదు.

‘వాళ్ళను వదిలేసి వెళ్ళిపోతాను కదా, శాశ్వతంగా. తెలుస్తోందా? శాశ్వతంగా?

నేను నిశ్చలంగా కూర్చుండి మనసులోనే ప్రార్థన చేశాను.భయమేసింది. కూర్చోలేక  లేచి నిలబడ్డాను.

'ఏమంటావు? ', అని, నా ముఖంలోకి చూచాడు.

' వెళ్ళు. వెళ్ళి అంతా చెప్పేసెయ్.ఏదీ ఉండిపోదు.నిజమొక్కటే నిలిచిపోయేది.నీ పిల్లలు ఎదుగుతారు.నీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకుంటారు', అన్నాను.

ఒక నిశ్చయానికి వచ్చేసాడు. వెళ్ళిపోయాడు.

ఆ తరువాత  పదిహేనురోజులు నన్ను కలవడానికి ప్రతిరోజు వచ్చేవాడు. ఆ క్షణాన్ని ఎదిరించడానికి యింకా సిద్ధంగా లేడు. అతని తెగని అంతస్సంఘర్షణ చూస్తే  నాకు చాలా బాధ కలిగేది.ఒకరోజు అనే వాడు:' నేను నిశ్చయించుకున్నాను.ఏమైనా  సరే చెప్పేస్తాను', అనే వాడు. మర్నాడు: 'నాకుతెలుసు, ఆ క్షణంనుండి యిక నాకు స్వర్గమే.పధ్నాలుగేళ్ళుగా యీ నరకం అనుభవిస్తున్నాను. శిక్షను స్వీకరిస్తాను. జీవించడం మొదలుపెడతాను. తప్పుచేసి తప్పుతో ఎంతకాలమైనా బతకొచ్చు.కాని అది బతుకుకాదు. నేను బతకాలి. బహుశా నా పిల్లలు నేనెటువంటి శిక్షననుభవించానో అర్థం చేసుకుంటారు. వాళ్ళు నన్ను నిందించరు.'

నేనన్నాను,' అందరూ అర్థం చేసుకుంటారు. వెంటనే కాకపోయినా, తర్వాత. ఎందుకంటే, నీవు సత్యాన్ని పట్టుకున్నావు, యీ లోకపుసత్యం కాదు. పై లోకపు సత్యం.'

నా మాటతో బరువు దించుకొని ఆ రోజు వెళ్ళిపోయేవాడు. మర్నాడు మళ్ళీ వచ్చేవాడు.ముఖంలో కాంతి ఉండదు. స్వరం వికటం.

'నేను వచ్చినప్పుడల్లా, నీవు నన్ను గుచ్చిగుచ్చి చూస్తావు. ఇంకా వీడు బయటపడడేమి అనుకుంటావు కదూ? ఆగు.నన్ను చులకనచేయొద్దు. అది, అది అనుకున్నంత సులభమేమీ కాదు. అసలు ఎప్పటికీ నేను బయటపెట్టలేకపోవచ్చు...నీవు వెళ్ళి చెప్పవు కదా?   చెబుతావా?'

గుచ్చే చూపులు  కాదు,అసలు అతడి వైపే చూడలేకపోయాను.నాలో అతడి గురించి ఆందోళన  పెరిగిపోతోంది, అతడికి ఏమవుతుందోనని. జాలేస్తోంది. నాకు రాత్రులు నిద్రపట్టడం లేదు.

మళ్ళీ వచ్చాడు మర్నాడు:' ఇప్పుడే యింటినుండి వస్తున్నాను. నా భార్య గడప దగ్గర నిలబడి నా వైపే చూస్తోంది. భార్య చూపు అంటే తెలుసా నీకు? నీకు తెలీదు. పిల్లలు, 'నాన్నా త్వరగా వచ్చెయ్.పిల్లల కథల పుస్తకం వినిపించాలి', అన్నారు.నీకు అర్థమవుతోందా? కాదు.ఈ లోకంలో ఒకడి బాధనుండి మరొకడు ఏమీ నేర్చుకోలేడు.'

అతడి కళ్ళు తడిశాయి. పెదవులు వణుకుతున్నాయి.ఉన్నట్టుండి టేబుల్ మీద బలంగా ఒక గుద్దు గుద్దాడు.టేబుల్ మీది వస్తువులన్నీ పైకెగిరాయి. అతడలా చేయడం అది మొదటిసారి.అతనిది మృదుస్వభావం. పైకెగిరిన వస్తువులు పట్టించుకోకుండా అతడు:

'అసలు అవసరమా? ఏమయింది చెప్పనందువల్ల? నా నేరానికి మరొకడు శిక్ష అనుభవించలేదే? అతడు జ్వరంతో పోయాడు. నా శిక్ష నేను అనుభవించాను ఇన్నాళ్ళుగా. అయినా ఇప్పుడు  నేను చేశానని చెప్పినా నా మాట ఎవడు నమ్ముతాడు? నా ఆధారాలు ఎవడు నిజమనుకుంటాడు? అనవసరంగా నా భార్యాపిల్లలకు జీవితాలలో సుఖము శాంతి లేకుండా చేయడం తప్ప ఒరిగేదేముంది? పొరపాటు పని కాదా ? ఏది ఒప్పు ఏది తప్పు? జనం ఏమంటారు? మెచ్చుకుంటారా? నా మంచితనాన్ని గుర్తిస్తారా? నా నిర్ణయాన్ని గౌరవిస్తారా? '

'దేవుడా!' అనుకున్నాను. ఇప్పుడుకూడా ఇతడు ఇతరుల గౌరవం గురించి ఆలోచిస్తున్నాడు.అతన్ని ఆ స్థితిలో చూస్తుంటే జాలివేసింది. అతని బాధను పంచుకోవాలని ఉంది.అతని బాధకు ఉపశమనం కల్గించాలని ఉంది. కాని ఎలా? అతడు తన వశంలో లేడు. అతని దుర్భరమైన అంతస్సంఘర్షణ అర్థమైంది, కొంత అనుభవిస్తున్నాను కూడా.

'నేనేం చెయ్యాలి ? నీవు నిర్ణయించు', అని ఆక్రోశించాడు.

'వెళ్ళు. వెళ్ళి బయట ప్రపంచానికి చెప్పు', అన్నాను, దృఢస్వరంతో కాదు. టేబుల్  మీద ఉన్న పుస్తకాన్ని తీసుకొని, తెరిచి చూపించాను.

“24. గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును
25. తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”

చదివి, ఒక నవ్వు నవ్వాడు.ఆ నవ్వులో బాధ, అసహనం, ఉపహాసం.

‘నిజం.గొప్ప గ్రంథాలు!  నా కోసం ఘోరమైన నిజాలు పట్టుకుంటావు ఆ గ్రంథాలన్నీ వెదికి వెదికి. ఈ గ్రంథాలు నా ముఖం మీద కొట్టడం నీకు సులభమే. అవును, ఎవరు రాశారు యీ గ్రంథాలు? దేవదూతలు! రాస్తారు.వాళ్ళకు పెళ్ళామా పిల్లలా ?. వాళ్ళకేం తెలుసు?'

ఈ సారి అతని ముఖంలో  నా పట్ల అసహ్యం కూడా కనిపించింది. కుర్చీలోనుంచి లేచాడు.

'మంచిది.వస్తాను.బహుశా మళ్ళీ మన కలయిక పరలోకంలో. పధ్నాలుగు సంవత్సరాల నరకం రేపటితో ముగుస్తుంది', అంటూ వెళ్ళిపోయాడు.

అతన్ని ఆలింగనం చేసుకోవాలనిపించింది. కాని ధైర్యం చాలలేదు. వెళ్ళిపోయాడు. నేను కూర్చీలో కూలబడిపోయాను. మనసులో ప్రార్థన చెప్పుకున్నాను, అతడికి అవసరమైన నిబ్బరం కలగాలని. నా కళ్ళవెంట నీరు కారుతూనే ఉండినాయి. అలానే కూర్చుండిపోయాను.

అర్ధరాత్రి అయింది. హఠాత్తుగా తలుపు తెరుచుకుంది. నాకు ఆశ్చర్యం వేసింది.అతడు మళ్ళీ వచ్చాడు.

‘ఎక్కడికి  వెళ్ళొస్తున్నావు?', అని అడిగాను.

'ఇక్కడేదైనా మర్చిపోయానా నేను? నా కర్చిఫ్?... పోనీలే.ఏమీ మర్చిపోలేదేమో?... నేను కొంతసేపు ఇక్కడుంటాను', అన్నాడు.

అతడు కూర్చున్నాడు.నేను అతడి పక్కనే నిలబడ్డాను. 'నీవూ కూర్చో', అన్నాడు. కూర్చున్నాను. రెండు నిమిషాలు నిశ్శబ్దం. నన్ను  తదేకంగా చూసి, చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు నాకు బాగా గుర్తు. ఆ తరువాత లేచాడు. నన్ను ఆలింగనం చేసుకున్నాడు.

‘జ్ఞాపకం ఉంచుకో.నేను నీ కోసం రెండోసారి వచ్చాను. వింటున్నావా? గుర్తుంచుకో,రెండోసారి', అంటూ వెళ్ళిపోయాడు.

'రేపు',నా మనసులో మెదిలింది.

అవును, ఆ మరుసటి రోజే. అతడు వచ్చివెళ్ళిన సాయంకాలం నాకు తెలీదు ఆ మరుసటి రోజు అతడి పుట్టిన రోజని. అతని పుట్టినరోజు ఎప్పుడూ ఘనంగా జరుగుతుంది. పెద్ద సమావేశం.  ఇంచుమించు టౌనంతా హాజరవుతుంది.ఈ రోజు కూడా. రాత్రి విందు ముగిసిన తరువాత అతడు హాలు మధ్యకు వచ్చాడు. చేతిలో ఒక కాగితం .ఆ నాడు తాను చేసిన హత్య గురించి పూర్తి  వివరాలున్న ఆ పత్రం, తను పనిచేస్తున్న  ప్రభుత్వశాఖ ముఖ్యాధికారికి రాసినది.  దాన్ని అక్కడ చేరిన వారందరి మధ్య నిలుచుని చదివి వినిపించాడు.చదవడం ముగించి:

' ఒక రాక్షసుడిలా ప్రవర్తించాను.మనిషికి మానవత్వానికి నన్ను నేను దూరం చేసుకున్నాను. ఇప్పుడు నాకు భగవంతుని ఆదేశం అందింది.నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. పాపఫలం స్వీకరిస్తాను', అన్నాడు.

అతడు  హత్య చేసిన రోజు ఆమె యింటినుండి తెచ్చి యిన్నేళ్ళు భద్రంగా దాచిన వస్తువులన్నీ , తను చేసిన హత్యకు సాక్ష్యాధారాలు అని అతడనుకున్నవి, తెచ్చి అక్కడ బల్లమీద ఉంచాడు--హత్య చేయబడిన స్త్రీ నగలు, ఆమెకు కాబోయే భర్త బొమ్మ ఉన్న ఆమె మెడలో ఉండిన లాకెట్టు, ఒక శిలువ, ఆమె డయరీ,ఆమెకు కాబోయే భర్త త్వరలో వస్తున్నాను అని ఆమెకు రాసిన ఒక ఉత్తరం, దానికి ఆమె రాసిన అసంపూర్ణ ప్రత్యుత్తరం. ఎందుకు ఉంచుకున్నాడు ఆ ఉత్తరాలు?  కాదనలేని  ఈ సాక్ష్యాధారాలు ఎవడైనా చింపివేయకుండా ఇన్నేళ్ళు ఎందుకు భద్రంగా  దాచుకుంటాడు?
     
అయితే, ఆ తరువాత ఆ రోజు  అక్కడ జరిగిందేమిటి? విన్నవారు అవాక్కయినారు. అతడు చెప్పిన కథ ఎవరూ నమ్మలేదు. ‘ఈయనకు మతి చలించింది అనుకున్నారు. కాని కథ ఆసక్తికరంగా ఉంది,విన్నారు.కొన్ని రోజులు గడిచాక టౌన్లో అందరు నిర్ధారణ చేసుకున్నారు, అతడికి మతి స్థిమితం తప్పింది అని. న్యాయాధికారులు  ఉపేక్షించలేరు కనుక విచారణ చేశారు. కాని ఆ ఆధారాలు బలమైనవి కావని కేసు మూసేశారు. ఆమె నగలు, ఆ ఉత్తరాలు నేరాన్ని ఖచ్చితంగా నిరూపించలేవు. అవి అతడికి ఒక స్నేహితుడికిచ్చినట్లు  కానుకలుగానో భద్రపరచమనో యిచ్చి ఉండవచ్చు. కేసు మూసేసిన తరువాత హత్యచేయబడిన స్త్రీ దగ్గరి బంధువులు ఆ నగలు ఆమెవే అని నిస్సందేహంగా గుర్తించారు. ఏమయినా, ఆ వ్యవహారం అంతటితో ముగిసింది.
   
అయిదు రోజుల తరువాత, టౌన్లో అందరూ అనుకుంటున్నారు, అతడు జబ్బుపడ్డాడని, బతకడని. జబ్బేమిటో తెలీదు. గుండెజబ్బన్నారు. కాని అతడి భార్య అతడి మానసికస్థితిని కూడా పరీక్షించమని అడిగిందట వైద్యుల్ని.అన్ని పరీక్షలు చేసి, చివరకు అది మానసికవ్యాధి అని తేల్చారు. జబ్బేమిటో నాకు తెలిసి ఉంటుందని ఊళ్ళో కొందరు నా దగ్గరకు వచ్చారు. నేనెవరితోను ఏమీ అనలేదు. అతణ్ణి కలవడానికి వెళ్లాను. కాని అతని భార్య నన్ను యింటిలోపలికి రానివ్వలేదు. నేనంటే మండిపడుతోంది.

'నీవల్లే ఆయనకు యీ  జబ్బు. నీవే కారణం. ఏడాదినుంచి మనసు సరిగా లేదాయనకు.వింతగా ప్రవర్తించేవాడు. ఊళ్ళో అందరికీ తెలుసు. నీ ప్రవచనాలు ఆయనను యీ  గతికి తెచ్చాయి. మరీ యీ నెలరోజులుగా కొంపలో కంటే నీ దగ్గరే ఎక్కువ ఉంటున్నాడు', అన్నది.

ఆమె మాత్రమే కాదు.ఊళ్ళో చాలామంది అదే అనుకుంటున్నారు.'నీవల్లే యిదంతా జరిగింది', అంటున్నారు. నాకు లోపల సంతోషం. భగవంతుడు అతణ్ణి కరుణించాడు. తనకు దూరమైన బిడ్డ తిరిగి చేరవస్తే తండ్రికి అంతకంటే ఆనందమేముంటుంది? అతడికి మతితప్పిందంటే నేను నమ్మలేదు. నేను ఎట్లాగైనా అతణ్ణి ఒక్కసారి కలవాలనుకున్నాను. అతడు కూడా , ప్రాణం పోయేలోపల నన్నొకసారి  చూడాలనుకుంటున్నాడని  తెలిసింది.  వెళ్ళాను. అతన్ని చూడగానే తెలిసింది, రోజులు కాదు గంటలలో ఉంది అని. బలహీనంగా ఉన్నాడు.ఒళ్ళు పాలిపోయి ఉంది. చేతులు వణుకుతున్నాయి. ఊపిరిపీల్చడం కష్టంగా ఉంది. కాని ముఖంలో కాంతి, ప్రశాంతి ఉన్నాయి.

'చేసేశాను' అన్నాడు,నన్ను చూస్తూనే.' నీ కోసం రోజూ ఎదురు చూస్తున్నాను.ఎందుకు రాలేదు యిన్ని  రోజులు?'

'నన్ను రానివ్వలేదు', అని అనలేదు నేను.

అతడన్నాడు: ‘భగవంతుడికి  నామీద  దయ  కలిగింది.నన్ను తన దగ్గరికి తీసుకుంటున్నాడు. నేను చనిపోతున్నాని తెలుసు. కాని ఎంత కాలం తరువాత మళ్ళీ ప్రశాంతి, సంతోషం! నా పని నేను చేశాను. మరుక్షణమే దివ్యలోకం దిగివచ్చింది నాలోకి. ఇప్పుడు నేను నా పిల్లలను ప్రేమించగలను. వాళ్ళను ముద్దుపెట్టుకోగలను. నా భార్య, న్యాయమూర్తులు, ఎవ్వరూ ఒక్కరుకూడా నమ్మలేదు నేను హంతకుణ్ణని. నా పిల్లలు కూడా ఎప్పటికీ నమ్మరు. అదీ,  వారిపై భగవంతుని కృప. నేను చనిపోతాను.కాని నా పిల్లలపై ఎటువంటి మచ్చవదలకుండా పోతున్నాను. స్వర్గంలో ఉన్నట్టుంది నాకు. నా కర్తవ్యం నేను నిర్వర్తించాను.'

అతడికి మాట్లాడడం కష్టంగా ఉంది. ఊపిరి  అందడంలేదు.  నా చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా ఒత్తాడు. చాలాసేపు మేం మాట్లాడలేదు. అతడి భార్య మాటిమాటికి తొంగి చూస్తున్నది. కాని అవకాశంచూసుకొని,నాతో రహస్యంగా అన్నాడు: ' నీకు  జ్ఞాపకం ఉందా? నేను ఆ రాత్రి నీ దగ్గరికి రెండవసారి వచ్చాను.గుర్తుంచుకో అని కూడా అన్నాను. నీకు తెలుసా నేను ఆ రాత్రి రెండవసారి ఎందుకొచ్చానో?....నిన్ను చంపడానికి! '

నేను ఉలిక్కి పడ్డాను.

'ఆ రోజు నీదగ్గరనుంచి వెళ్ళిపోయానా? బయట చీకటి. వీధులవెంట తిరిగాను. నాలో నేను ఘర్షణ పడ్డాను. ఉన్నట్టుండి నీ మీద విపరీతమైన ద్వేషం కలిగింది. భరించలేనంత.: 'ఈవేళ   నన్ను కట్టిపడేస్తున్నది అతడొక్కడే. నా విధిని నిర్ణయించే న్యాయనిర్ణేత అయినాడతడు. ఇంత జరిగిన తరువాత, రేపు నలుగురి ఎదుట నా నేరం ఒప్పుకోక తప్పదు. వాడికి అంతా తెలుసు.' అనుకున్నాను. నీవు నా నేరాన్ని బయటపెట్టేస్తావని భయపడలేదు. నాకు ఆ ఆలోచనకూడా రాలేదు. కాని అనుకున్నాను:'నా గురించి యింత తెలిసిన తరువాత నా ముఖం అతనికి ఎలా చూపించను? ముఖం చూడనక్కరలేదు. అతడు దూరంగా ధృవప్రాంతంలో ఉన్నా ఈ ఆలోచన భరించడం దుర్భరం.’  నీవే కారణం ఈ దుర్భరవేదనకు అనుకున్నాను. ఈ వేదన అంతం కావాలంటే నిన్ను అంతం చేయాలి. అప్పుడు రెండోసారి వచ్చాను నీ దగ్గరికి. నీ టేబుల్ మీద కత్తి ఉండడం గుర్తు ఉండింది. వచ్చి కూర్చొన్నాను.నిన్నూ కూర్చోమన్నాను. ఒక నిమిషం, నిమిషమంతా ఆలోచించాను. ఆ క్షణంలో నిన్ను చంపి ఉంటే, వెనుకటి హత్యమాట ఎట్లా ఉన్నా, ఈ హత్యతో సర్వనాశనం అయిపోయేవాణ్ణి. కాని ఆ క్షణం అదేమీ ఆలోచించలేదు నేను .కేవలం నీ మీద పగతీర్చుకోవాలన్న ఆలోచనమాత్రమే. భగవంతుడు ఆ క్షణం నా లోపలి  దయ్యాన్నుండి నన్ను కాపాడాడు. కాని, తెలుసా? ఆ రోజు నీవు మృత్యువుకు దగ్గరగా ఉన్నంతగా  ఎప్పుడూ లేవు.'
     
 ఒక వారం తరువాత అతడు చనిపోయాడు. టౌన్ మొత్తం శవయాత్రలో పాల్గొంది. అక్కడి ముఖ్య పూజారి అతన్ని గురించి ఆర్ద్రంగా మాట్లాడాడు. అందరూ ఆ మాయదారి జబ్బును నిందించారు.ఆయన అకాలమరణానికి సంతాపం చెందారు. ఊళ్ళోని జనమంతా నా మీద చాలా కోపంగా ఉన్నారు, అతని మరణానికి కారణం నేనేనని వారి దృఢభావం. నన్ను చూడడానికి కూడా యిష్టపడడంలేదు. కొందరు మాత్రం అతడు ఆనాడు చెప్పింది నమ్మారు. నమ్మినవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.  నా దగ్గరకు వచ్చేవారు, నిజమేమిటో చెబుతానని. మనిషి పతనం  వినడం  జనాలకు యిష్టం కదా! నేను పెదవి విప్పలేదు. ఆ తరువాత కొద్ది రోజులలోనే  నేను ఆ వూరు వదిలివెళ్ళిపోయాను.

                                                    ******

వివరణ:

సాధారణంగా కథలలో  నేరంచేయనివాణ్ణి నేరస్థుడిగా న్యాయస్థానాలు గుడ్డిగా (చట్టానికి కళ్ళులేవు) తీర్పు చెప్పడం వస్తువు. నేరం చేసినవాణ్ణి నిర్దోషిగా ప్రకటించి అన్యాయంగా వదిలేయడమూ కథావస్తువు. కాని యీ డోస్టోవ్ స్కీ  కథలో అటువంటి అన్యాయం లేదు. ఈ కథలో చట్టానికి సమాజానికి కథానాయకుడు హంతకుడని తెలియదు. ఎన్నటికీ తెలిసే అవకాశంకూడా లేదు.కాని తాను హంతకుణ్ణి అని లోకానికి ప్రకటించేవరకు, ఆ హంతకుడు అనుభవించిన వ్యథ యీ కథావిషయం.

ప్రస్తుతకథాభాగానికి వద్దాం.

ఈ నవలలో (The Brothers Karamazov)నవలలో కీలకమైన భాగాలుగా ఉంటూకూడా  స్వతంత్రంగా బతకగలిగిన కథలు కొన్ని ఉన్నాయి. ( ఉదా. కోల్యా కథ Nikolai Ivanov Krasotkin - Kolya).  ఇందులోని The Grand Inquisitor అనే భాగం యించుమించు ఒక స్వతంత్రగ్రంథం అయిపోయింది. విడి పుస్తకంగా దొరుకుతోంది కూడా.కాని దానితో కలిపి చదువుకోవలసిన ప్రస్తుతకథాభాగం,ఒక అద్భుతమైన కథగా కూడా  గుర్తింపు పొందవలసినది.  కాని, చాలామంది పాఠకులు, యీ భాగాన్ని అసలు నవలలో ఉన్నట్టుకూడా గుర్తించినట్టు లేదు.ఈ “నవల లోపలి నవల”ను  దాటేసి అవతలికి వెళ్ళిపోయారు. అలా దాటెయ్యడంవలన, ఒక మంచి కథను దాటెయ్యడమే కాక, దానికీ, The Grand Inquisitor కు ఉన్న సంబంధం ఉపేక్షించడమవుతుంది.

మహాన్యాయాధిపతి (The Grand Inquisitor)

డోస్టోవ్ స్కీ కాలానికి కొంచెం ముందు వరకు రోమన్ కాథలిక్ చర్చి, చర్చి అధికారాన్ని కాదన్నారన్న నెపంతో  వేలమందిని “నేరవిచారణ” ( Inquisition) జరిపి, నేరం ధృవపరచి, తగులబెట్టింది. జోన్ అఫ్ ఆర్క్ పేరు విన్నాం. పేరులేని వేలమందిని తగులబెట్టింది చర్చి. ప్రస్తుత నవలలో ఏకంగా జీససే దొరికిపోయాడు మతాధికారులకు. ఆయన యీ నేలపై తిరుగుతుండగా పట్టుకొని అరెస్ట్ చేశారు. మతన్యాయాధికారి (Inquisitor) జీసస్ ను నేరవిచారణ చేయడం యీ నవలాభాగంలోని విషయం. (అంత జరిగిన  తరువాత జీసస్ తిరిగి యీనేలపై తిరగడం తప్పుకదా!) చర్చికి శత్రువు సైతాను కాదు, క్రీస్తు. (నవలలోని యీ భాగం ఇవాన్ రాసిన ఒక కావ్యం.)

ఏమిటి క్రీస్తుపై అభియోగం? సృష్టిలో కోట్లమంది ఉన్నా. మనిషి ఒంటరివాడు. ఆ ఒంటరితనంలో అభద్రత ఆవిర్భవిస్తుంది. భద్రతకోసం భగవంతుణ్ణి సృష్టించి యిచ్చింది చర్చి. ఊరకే యిస్తుందా? ఏదీ ఊరకే రాదు. (మతమైనా రాజ్యమైనా సమాజమైనా కుటుంబమైనా, భద్రత ఊరకే యివ్వదు. ప్రస్తుతవిషయం మతం.)మతం మనిషికి భద్రత యిచ్చి అతని  స్వాతంత్ర్యాన్ని తీసేసుకొంటుంది. నిరంకుశంగా శాసిస్తుంది. మతం, మతం మారి సామ్రాజ్యమైపోతుంది. (ఇది వాస్తవమైన మతమార్పిడి.)న్యాయాధికారి జీసస్ తో అంటాడు, “ మేము సీజర్  కత్తిని, రోమ్ ను లాగేసుకున్నాం.ఈ భూమిపై ఎదురులేని శాసకులుగా ప్రకటించుకున్నాం.” ఎందుకు? “పాపం వారు చిన్నపిల్లలు.అల్లరిచేసి బడిపంతుల్ని బడిలోకి రానివ్వకుండా అడ్డుకుంటారు. కాని వారి అల్లరి ఆనందం చాలాకాలం ఉండదు. దానికి వాళ్ళు చాలా మూల్యం చెల్లించుకోవలసివస్తుంది. దేవాలయాలు ధ్వంసం చేస్తారు.ఈ నేలను నెత్తుటితో ముంచెత్తుతారు.అలసిపోయి వారి దుర్బలతను  తెలుసుకుంటారు…  కాని, నీవేం చేశావు? వాళ్ళ స్వాతంత్ర్యం తీసేసుకోకపోగా, దాన్ని మరింత ఎక్కువ  చేశావు.”

జీసస్ ఒక్కమాట మాట్లాడలేదు. న్యాయాధికారివద్దకు మెల్లగా నడిచి వెళ్ళి, అతని చేతిని ముద్దు పెట్టుకున్నాడు.

న్యాయాధికారి జీసస్ ను వదిలేశాడు: “వెళ్ళిపో! కాని మళ్ళీ రాకు”, అంటాడు.

ఎవరు ఒప్పు, ఎవరు తప్పు? న్యాయాధికారి అన్నమాట నిజంకాదు అనగలమా? మనిషి భద్రతకోసం, రొట్టెముక్కకోసం,  స్వేచ్ఛను అమ్ముకుంటాడన్నమాట నిజం కాదనగలమా ? జీసస్ ప్రేమ సమాధానం సమస్యను పరిష్కరిస్తుందా? ప్రపంచంలోని అన్యాయాన్ని దుర్మార్గాన్ని జయించగలుగుతుందా? జీసస్ ఓడిపోతాడు, ఓడిపోయాడు అనకుండా ఉండగలమా? అలాగని, జీసస్ పెట్టిన ముద్దు న్యాయాధికారి గుండెలో ఒక శాశ్వతమైన దివ్యకాంతిని వదిలివెళ్ళిన మాట నిజం కాదా? మనం ఎవరి పక్షం? డోస్టోవ్ స్కీ ఎవరి పక్షం? రొట్టెముక్క కావాలా, (యీ రొట్టెముక్క కొందరు ప్రసాదమని,  కొందరు సాదమని పంచుతారు), లేక స్వేచ్ఛ కావాలా?

న్యాయాధికారి జీసస్ ను వదిలేశాడు: “వెళ్ళిపో! కాని మళ్ళీ రాకు”, అంటాడు.క్రైస్తవమతానికి శత్రువు సైతాను కాదు, జీసస్. జీసస్ మనిషిని,  చర్చినుండికూడా, ముక్తుణ్ణి చేస్తాడు.చర్చి  తన అనుయాయులస్వేచ్ఛను సహించలేదు.ఈ న్యాయాధికారి,  మతం ముసుగులో ఉన్న సైతాను కాదా? మనం సైతాను పక్షం కామని, క్రీస్తు పక్షమని నిర్ద్వంద్వంగా చెప్పగలమా?

ఈ ప్రశ్నకు సమాధానంలోని సంఘర్షణే దీని తరువాత వచ్చే ప్రస్తుతకథావిషయం.

ఇది ఫాదర్ జోసిమా కథ. ఆయన ఆల్యోషాతో చెప్పుకున్న తన కథను,”ఆయన మాటలలో” నే  ఆల్యోషా రాసినది, (“composed in his own words”)

అందరిచేత యీనాడు మహిమాన్వితుడిగా ఆరాధింపబడుతున్న జోసిమా, యవ్వనంలో ఒక తాగుబోతు తిరుగుబోతు.ఎవరినీ దేనినీ లెక్కచేసేవాడు కాదు. కాని, అతని జీవితకాలంలో అతడి గతం ఎవరికీ తెలియదు.

ఈ కథలోని యిద్దరు ప్రధానపాత్రలలో  జోసిమా ఒకడు. రెండవవాడు ఆ టౌన్ లో  పెద్దమనిషిగా సంభావించబడుతున్న హంతకుడు . ప్రధానకథా విషయం ఆ హంతకుడి పాపము, పశ్చాత్తాపము, ప్రక్షాళనము.

ఈ కథలో మనం గమనించవలసిన ముఖ్యవిషయాలు:
కథాగమనవేగంలో ఉత్కంఠభరితపఠనంలో, మొదటిసారి చదివినపుడు మనం కొన్ని ప్రధానమైన విషయాలు గమనించకపోవచ్చు.

'ఈ మధ్య మీరు ఈ టౌన్లో తిరుగుతూ, కొందరి యిళ్ళకు వెళ్లడం, వారితో వాళ్ళ కష్టసుఖాలు మాట్లాడడం చూస్తున్నాను. మీరు వాళ్ళకు చెపుతున్న మాటలు వింటున్నాను కూడా. మీరు సామాన్యవ్యక్తి అనిపించడం లేదు.  మీది దృఢమైన ధార్మికప్రవృత్తి. మీలో సత్యనిష్ఠ  కనిపిస్తున్నది.మీరు చేస్తున్న పని అందరూ చేయగలిగింది కాదు. పరువు నష్టమనీ, నలుగురూ చులకన చేస్తారనీ తెలిసి కూడా, మీరు చేయదలచుకున్నది చేసేస్తారు.అలా చేయడానికి చాలా ధృతి ఉండాలి'.

ఈ కథాకాలంనాటికి, జోసిమా ఫాదర్ కాదు. బ్రదర్ కూడా కాదు. అది అతని  ధార్మికపరివర్తనలో ప్రథమదశ. ఉత్తీర్ణుడు కాదు,  కాని తీర్ణుడు. ( “స్వయం తీర్ణః పరాంస్తారయతి ”) ఒక హంతకుడి పరివర్తనలో పాపవిమోచనంలో  ప్రేరణ అయినవాడు. ఒక సైనికాధికారిగా ఉండినవాడు, ఆ పదవికి రాజీనామా చేశాడు.ఊళ్ళో సామాన్యజనాలతో కలిసిమెలిసి తిరుగుతూ, వారి కష్టసుఖాలన తెలుసుకుంటూ, తోచినమాటలు చెబుతూ ఉంటాడు. ఇవి సాధారణంగా ఏ పాస్టరో చేస్తాడు. ఇతడి విధినిర్వహణ ఆధికారికం కాదు. అప్పటికి అతడికి చర్చితో ఏ అనుబంధము లేదు.ఇది, “చర్చి మాత్రమే యీవిధులు నిర్వహించగలదు, మరెవరూ యీఅధికారాన్ని  తమ చేతుల్లోకి తీసుకోరాదు”, అన్న చర్చిని తిరస్కరించడం.

క్రైస్తవమతంలో, తప్పుచేసినవారు తమ తప్పును ఫాదర్ చెవిలో ఊదుతారు.లోకానికి ఆ రహస్యంతో సంబంధం లేదు. ఈ కథలో, హంతకుడు తన పాపాన్ని తన పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించబడిన అతిథులు, ఒక పై అధికారి ఎదుట, రాసి ఉంచుకున్న కాగితం చదివి, నేరాన్ని లిఖితపూర్వకంగా ప్రకటిస్తాడు. ఇది కూడా చర్చిని  తిరస్కరించడమే.


ఈ విధి నిర్వహణ చేసే వ్యక్తి, మతాధికారి కాని కాకపోనీ, తాను చెప్పేది పూర్తిగ తాను నమ్ముతాడని నమ్మకం ఉందా?

హంతకుడు జోసిమాతో:

'అంటే నీవు నమ్మవన్న మాట? నీవు నలుగురికీ నమ్మకం కలిగిస్తావు, కాని నీకు నమ్మకంలేదు? విను.తప్పక వస్తుంది.”

ఇక్కడ మనం గమనించవలసింది, కథలో జోసిమా మతాధికారి కాదు, కాని చర్చికి ప్రతినిధి. అంటే, అతని గురించి హంతకుడన్నమాట, చర్చిలోని అధికారులకు వర్తిస్తుంది. లోకానికి విశ్వాసం గురించి చెబుతుంటారు.కాని వారికే గట్టినమ్మకం ఉండదు.

ఇలా, యీ కథలో రోమన్ కాథలిక్ చర్చిపై తన వ్యతిరేకతను గూఢంగా వ్యక్తం చేస్తాడు రచయిత.డోస్టోవ్ స్కీకి రష్యన్ ఆర్థొడోక్స్ చర్చిపై అభిమానం ఉండవచ్చు. కాని యీ విమర్శలో ఆ అభిమానం ప్రధానం కాదు. వ్యక్తి స్వేచ్ఛ ప్రధానం. దానిని ఏ వ్యవస్థకూడా హరించడం అతడికి యిష్టంకాదు.

నవలలో న్యాయాధికారిఘట్టం తరువాత వచ్చే యీ కథలో చర్చి అప్రాధాన్యాన్ని చెప్పే యీ అంశాలు గుర్తించడం అవసరం.

చర్చిని కాదనడం సులభమే కావచ్చు. క్రీస్తును స్వీకరించడం అంత సులభమా? ఎంత కష్టమో డోస్టోవ్  స్కీకి తెలుసు. నవల అంతా అదే కష్టం.ఈ కథాభాగంలో ఆ కష్టాన్ని అంతటినీ చిక్కబరచి నింపాడు.

వ్యక్తి బాధ్యత:

ఈ కథలో హంతకుడు తన నేరాన్ని ఒప్పుకోవలసిన అవసరం ఏముంది? న్యాయస్థానం అతణ్ణి నేరస్థుడు అనలేదు.సమాజం అతణ్ణి మహాత్ముడు అని మన్నన చేస్తున్నది.సుఖంగా బతికేయొచ్చుకదా?

ఈ కథ బైబిల్ లోని అబ్రహాం కథకు విపర్యయం అనవచ్చు. అబ్రహాం తన కొడుకును బలి యివ్వడం చట్టం దృష్టిలో హత్య, శిక్షార్హమైన నేరం. సమాజం దృష్టిలో అతినింద్యమైన నిర్దయచర్య. ఈ డోస్టోవ్ స్కీ కథలో హంతకుడు చట్టం దృష్టిలో నిర్దోషి, సమాజం దృష్టిలో మహాత్ముడు. కాని అక్కడా యిక్కడా కూడా భయము కంపము ఉన్నాయి.బైబిల్ కథలో హత్య జరగలేదు, యీ కథలో హత్య జరిగింది. బైబిల్ కథలో హత్య జరిగిఉంటే చట్టం దృష్టికి సమాజం దృష్టికి వచ్చిఉండేది. కాని పరస్పరం విపర్యయంగా కనిపించే యీ రెండు కథలలోను సామాన్యాంశం ఒకటి ఉంది. అది, చట్టము సమాజము కథకు అప్రధానం.అవి అప్రధానమన్నదే కథలో ప్రధానవస్తువు.

ఈ వాస్తవానికి రెండు ముఖాలు. సృష్టిలో మనిషి ఒంటరి. సర్వతంత్రస్వతంత్రుడు కూడా. ఒంటరితనం భయకారణం. (“ఏకాకీ బిభేతి” అని బృహదారణ్యకం.) ఒంటరితనము భయము పోవాలంటే రెండవదేదైనా ఉండవలె,  (“స ద్వితీయమైచ్ఛత్”.బృహ.) కాని ఆ రెండవది పుట్టగానే, దానితో భయంకూడా పుట్టుకొస్తుంది, (“ద్వితీయాద్వై భయం భవతి.”బృహ.) ఇది మనిషి అస్తిత్వవాస్తవం.

ఒంటరితనం రెండువిధాలు. ఒకటి సమష్టితో కలిసిపోలేని ఒంటరితనం. రెండవది, సమష్టిలో లయమై, సమష్టిని తనలో నింపుకొని, సమస్తాన్ని మించి నిలిచిన వ్యష్టి ఒంటరితనం. ఈ రెండవదానికి కొంత వివరణ అవసరం.

"Faith is just this paradox, that the single individual as the particular is higher than the universal… the single individual who having  been subordinate to the universal as the particular, now by means of the universal becomes that individual who, as the particular, stands in an absolute relation to the absolute." (Kierkegaard:Fear and Trembling.tr. Hannay.p.84-85)

సమష్టితో  కలిసిబతకలేని ఒంటరితనం,  సమష్టితో  ఆత్మీయతను పొంది, సమష్టిని తనలో నింపుకొని, సమష్టిని మించి ఎదుగుతుంది. వ్యష్టి సమష్టిలో  ఒదిగి ఎదగడం అంటే యిదే. ఒదిగినపుడూ ఒంటరి, ఎదిగినపుడూ ఒంటరి. మొదటి ఒంటరితనం అల్పం, రెండవది భౌమం.

ఈ కథలో వస్తువు యీ రెండవ ఒంటరితనం. ఈ ఒంటరితనంలోకి చట్టానికి, సమాజానికి, చివరకు ధర్మానికి (religion) కూడా ప్రవేశం లేదు.  ఇందులో హంతకుడు తన నేరాన్ని ఒప్పుకున్నది తన వెలుపలి శక్తులకు లొంగిపోయి కాదు. తన ఆత్మను కాపాడుకోడానికి.అస్తిత్వవాదం,  వ్యక్తి ఆత్మ ( individual self) లో,  వ్యక్తికంటే ఆత్మ (self) కు ప్రాధాన్యం యిస్తుంది. అస్తిత్వవాదాన్ని ఒక విధంగా  ఆత్మవాదం అనవచ్చు. అన్ని విధాలైన వెలుపలి (అనాత్మ) బంధాలను వదిలించుకొని, కేవలం “నేను”గా మిగిలి ఉండడం. అదే “కేవలోహం”.) ఈ కథలో హంతకుడు  అనాత్మను అనాదరించే స్థితికి చేరుకున్నాడు. న్యాయం నిర్దోషి అననీ,సమాజం మహాత్ముడననీ, అవి తనకు అవసరం లేదు.అబ్రహాం కథలో కూడా, యిదే చూశాం. పరమమైన విధేయత ఆత్మకే, చట్టానికి  లోకనీతికి అందులో భాగం లేదు.

పాపము, క్షమ:

"నిస్పృహ  పాపం ("Despair is sin") …పాపానికి వ్యతిరేకపదం పుణ్యం కాదు, అశ్రద్ధ", అంటాడు కీర్క్ గార్డ్. (“the opposite of faith is not sin, but unbelief or the refusal to believe’.  “ఆమరణవ్యాధి”: “Sickness unto Death.”)

ఏది నిస్పృహ? “నేను పాపులలోకెల్లా మహాపాపిని, నన్ను భగవంతుడుకూడా క్షమించలేడు”, అనడం నిస్పృహ. ఆ నిస్పృహ భగవంతుని అనంతక్షమాగుణానికి పరిమితి విధిస్తుంది. అది అశ్రద్ధ, నమ్మకం లేకపోవడం. అది పాపం.

శ్రద్ధ కొండలను కదిలిస్తుంది.పాపికొండలను కరిగిస్తుంది. శ్రద్ధ కలిగితే కలగనిది లేదు. కాని ఆ శ్రద్ధ ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది? నారకపావక (inferno, Purgatorio) భూమికలను గడచి వెళ్ళవలె. ఈ కథలో ఆ భూమికలను ఆవిష్కరించాడు డోస్టోవ్ స్కీ. హంతకుడు నడచిన నరకం చూపించాడు రచయిత.

భగవంతుడి క్షమాగుణం అనంతం. కనుక అనంతంగా పాపాలు చేయమని అర్థమా? అదే అందులోని రహస్యం. భగవంతుని కృపాస్పర్శ కలిగిన తరువాత, మూడులోకాల ఆధిపత్యం కాదు, పధ్నాలుగు లోకాలు నీ పాదాలవద్ద పడేసినా పాపం చేయలేవు.

కీర్క్ గార్డ్ రాతలలో (ముఖ్యంగా The Concept of Dread,Sickness unto Death) చాలా ఎక్కువగా ఆక్రమించిన విషయం పాపం.( ఈనాడు కీర్క్ గార్డ్  సాహిత్యకారులకంటే మానసికవైద్యులకు ఎక్కువ ఆదరణీయుడు. పాపభావము అభావము కూడా ఏవిధమైన మానసిక అస్వస్థతలకు కారణాలవుతాయో కీర్క్ గార్డ్ తన రచనలలో చాలా చోట్ల వివరించాడు.ప్రస్తుతకథలో కూడా మానసికవైద్యులప్రసక్తి ఉంది.హంతకుడి భార్య తన భర్తకు మానసికవైద్యచికిత్స అవసరం అంటుంది.)

ముఖ్యం ముక్తి కాదు, పాపం. ఇది సహజమే. ముక్తి, పాపంనుండి ముక్తి కదా? సోక్రటీస్ అజ్ఞానం తప్ప పాపం లేదు అంటాడు.మనిషి “తెలియక” తప్పు చేశాడంటే  కీర్క్ గార్డ్  కాదంటాడు. పాపం చేయడం, మనిషి స్వభావం. చేయకపోవడం స్వభావాన్ని అతిక్రమించడం.  తనలోని పాపాన్ని తెలియడం, ఒప్పుకోడం శ్రద్ధకు దారి.

కీర్క్ గార్డ్ అంటాడు, కేవలం పశ్చాత్తాపం వల్ల ప్రయోజనంలేదు. శ్రద్ధ ఉండాలి. ఏ పాపమైనా దేవుడు క్షమించలేనంత పెద్దది కాదు, క్షమిస్తాడు అన్న శ్రద్ద ఉండాలి. శ్రద్ధలేని పశ్చాత్తాపం వ్యర్థం.ఈ కథలో హత్యచేసిన పెద్దమనిషి చాలానే పశ్చాత్తాపం చెందాడు. నరకవ్యథను అనుభవించాడు. శ్రద్ధ కలిగిన తరువాతనే తన నరకం తొలగింది. ఎలా తొలగింది?

వెలివేత తొలిగేది ఎలా?

ఏ ఒంటరితనం తొలగడానికి తోటిమనిషిని కాదని మనిషి దేవుణ్ణి సృష్టించుకున్నాడో, ఆ ఒంటరితనపు తత్త్వం తెలుసుకున్నాడు.


'వెలివేతా? ఏ వెలివేత?'

డోస్టోవ్ స్కీ రచనాచాతుర్యం హంతకుడిని జోసిమా అడిగిన యీ ప్రశ్నలో తెలుస్తుంది.

“ఏ వెలివేత?'అని అడగడమేమిటి? ఎన్ని వెలివేతలున్నాయి? “వెలివేత”  సాధారణంగా మతాధిపతుల భాష, ( excommunication). ఇక్కడ ఆ ప్రసక్తి లేదే! ఇది చర్చి విధించిన వెలివేత కాదు. “ఏ వెలివేత?” కు హంతకుడిచ్చిన సమాధానం యీ కథాసారం అనవచ్చు.

'మనిషి మనిషిని వెలివేయడం. మనిషి మనిషితో కలిసి బతకలేకపోవడం. వెలిగా,  వెలితిగా బతకడం. లోకమేమైపోయినా సరే, నేనుబాగుంటే చాలు అనుకోడం.'

దేవుని ద్వారా మనిషిని కాదు, మనిషిద్వారా దేవుని తెలుసుకున్నాడు, యీ కథలోని హంతకుడు:
ఈ అవగాహన, హంతకుడు ప్రక్షాళనభూమికపై చాలాదూరం నడిచివచ్చాడని చెబుతోంది.

హంతకుడు చాలా బాధను అనుభవించాడు.ఈ సందర్భంలో అతడన్న ఒకమాట వాస్తవక్రైస్తవానికి నిర్వచనం. ముఖ్యంగా కీర్క్ గార్డ్ ప్రవచించిన  వాస్తవక్రైస్తవానికి పునాదిరాయి.

(కీర్క్ గార్డ్ ప్రసక్తి  యీ వ్యాసంలో యింత తరచుగా రావడం అసందర్భమేమీ కాదు. ఒక కోణంలో  వారిద్దరూ కవలలు. కీర్క్ గార్డ్ తాను క్రైస్తవధర్మానికి అంకితమై పోయానని, కాదు, క్రైస్తవధర్మం తనను దత్తత తీసుకున్నదని, చెప్పుకున్నాడు కదా! డోస్టోవ్ స్కీకి,   ఆస్తిక్యానికి నాస్తిక్యానికి  మధ్య ఊగిసలాట ఉంది.అది అతనిది మాత్రమే కాదు.మనందరిదీ. మనలోని ఊగిసలాటనే  డోస్టోవ్ స్కీ పలికించాడని చెప్పుకోవచ్చు.)

ఈ కథలో హంతకుడు అన్నమాట యిది : “ఈ లోకంలో ఒకడి బాధనుండి మరొకడు ఏమీ నేర్చుకోలేడు.”

ఇది కూడా,క్రైస్తవ అస్తిత్వవాదంలో ఒక కీలకభావం: “… faith has never existed just because it has always  existed."(Kierkegaard: Fear and Trembling.tr.Hannay.p.85)

ఎవడి శ్రద్ధను వాడు సంపాదించుకోవలె, రక్తం చిందుతూ. ఒకడి శ్రద్ధను మరొకడు సంపాదించిపెట్టలేడు.తస్మాత్ జాగ్రత, ఎవడి రక్తం వాడే చిందించుకోవలె!ఎవడి శిలువపై వాడే!

స్వేచ్ఛ, వ్యథ:( Freedom and angst):

హంతకుడి వ్యథ అతడి స్వేచ్ఛాఫలం. అతడు తన నేరాన్ని ఒప్పుకోవలసిన అవసరం లేదు. కాని ఒప్పుకునే స్వేచ్ఛకూడా అతడికి ఉంది. ఉండబట్టే ఒప్పుకున్నాడు. ఆడమ్ నిషిద్ధఫలం తినవచ్చు, తినకుండా ఉండవచ్చు. ఆ నిర్ణయస్వేచ్ఛ లేనపుడు బాధలేదు. స్వేచ్ఛ ఉన్నపుడే ఘర్షణ, వ్యథ. (angst.) “ స్వేచ్ఛ మనిషికి విధించిన శిక్ష.”(సార్త్ర్) ఈ ఘర్షణ ఆడమ్ నుండి సంక్రమించిన వారసత్వం కాదు,(ఆగస్టిన్ అన్న  peccatum originale, "original sin") ఈ ఘర్షణ స్వేచ్ఛాఫలం.
కాని యీ ఘర్షణే మనిషికి ముక్తిసాధనం. అది మనకున్న స్వేచ్ఛాస్వరూపాన్ని వివరిస్తుంది. మన ఎంపికకు ఒక మార్గం చూపిస్తుంది.

బాధ్యత:

ఈ కథలో హంతకుడి నోట మరో మాట పలికిస్తాడు ( జోసిమాతో ) డోస్టోవ్ స్కీ:

“అవును. నీవంటూ ఉంటావే, అదినిజం. మనం మన కర్మలకే కాదు, లోకంలో అందరి కర్మలకు అందరి పాపపుణ్యాలకు  బాధ్యులం.”

“లోకంలో అందరి కర్మలకు అందరి పాపపుణ్యాలకు  మనం బాధ్యులం.” ఇది ఆధ్యాత్మికమార్గంలో సద్గురువుల నోట తరచు వినపడే మాటే. జగ్గీ వాసుదేవ్ యిటీవల జిడ్డు కృష్ణమూర్తి గురించి మాట్లాడుతూ, కీర్క్ గార్డ్ , డోస్టోవ్ స్కీల పేర్లుకూడా ప్రస్తావించాడు.ఈ బాధ్యత విషయంలో ఆయన ( మరో సందర్భంలో) ఏమంటున్నాడు?

"Responsibility does not mean taking on the burdens of the world. It does not mean accepting blame for things you have done or not done. it does not mean living in a state of perpetual guilt.Responsibility simply means your ability to respond. If you decide, ‘I am responsible,’ you will have the ability to respond.  If you decide, ‘I am not responsible,’ you will not have the ability to respond. It is as simple as that. All it requires is for you to realize that you are responsible for all that you are and all that you are not, all that may happen to you and all that may not happen to you." Isha Jaggi Vasudev

లోకంలో ఎవడు ఎక్కడ హత్య చేసినా, “ఆ హత్య నేనే చేశాను”, అని అరిచి చెప్పాలా! లేక, ప్రపంచంలోని దుఃఖాన్నంతా నా భుజాలపై వేసుకు బతకాలా? అది కాదు దాని అర్థం. లోకంలో జరుగుతున్నవాటికి నీవు స్పందించగలగాలి. “అది వాడి ఖర్మ”, అనకుండా వాడికి నేనేమైనా చేయగలనా! ప్రతి ఒక్క విషయంలోను చేయలేవు. చేయడం కాదు ముఖ్యం. చేయాలన్న తపన. స్పందన.

ఇది అస్తిత్వవాదంలో కూడా వినపడుతుంది.

“మనిషి తనకొరకు తీసుకునే నిర్ణయం, సమస్తమానవాళికొరకు నిర్ణయం.” “…in choosing for himself [man] chooses for all men” ( Sartre:Existentialism Is Humanism) అదెలా? నాకు హానికరమైన నిర్ణయం నేను తీసుకోను కదా? అది యితరులకు కూడా హానికరం కాలేదు.
ఇందులో అస్తిత్వవాదవైరుధ్యం కనిపిస్తుంది. ఏమిటది? అస్తిత్వవాదంలో మనిషి తప్ప మానవత లేదు కదా? మానవత అనేది తత్త్వం (essence) కదా? అస్తిత్వవాదంలో  నాకు మేలు చేసేది నాకు మాత్రమే మేలుచేయాలి కదా?

దీనికి సార్త్ర్ సమాధానం:

“జరిగేదేమంటే, మనిషి తాను కోరినట్టుగా  తనను తాను నిర్మించుకోడం కొరకు,  తాను ఏ విధమైన మనిషిగా రూపొందవలె అనుకుంటాడో ఆ రూపం ఊహించుకుంటాడు. అనురూపమైన చర్యలే   తీసుకుంటాడు. ఒక్కటి కూడా  అందుకు భిన్నంగా ఉండదు. ఇదా అదా అన్న విచికిత్స కలిగి, వాటిలో ఒకదానిని ఎంచుకోడమంటే దాని విలువను గుర్తించడమే. రెంటిలో తక్కువ విలువైనదానిని ఎంచుకోలేము. ఎప్పుడైనా, ఎంపికచేసుకున్నపుడు ఎక్కువ విలువైనదానినే ఎంచుకుంటాం. అందరికీ మేలుచేయగలదైతేనే కాని  నాకు మేలు చేయలేదు.”(“అస్తిత్వవాదం మానవతావాదం”)

(There's not a single choice of our acts which doesn't which doesn't at the same time create an image. of man as we think we ought to be. To choose to be this or that is to affirm at the same time the value of what we choose, because we can never choose evil. We always choose the good, and nothing can be good for us without being good for all.
 "Existentialism is Humanism": Sartre)

సార్త్ర్ సమాధానంతో మనం సమాధానపడాలి. పేచీ పడలేము కనుక, పడరాదు కనుక. మనం కోరుకునేది ఆ సర్వమానవాభ్యుదయం కనుక. అది వాదాలను దాటిన ప్రేరణ. సమస్తమానవాళికి మేలు చేయనిది నాకు మేలు చేయలేదు అన్న అవగాహనకు ఏ పేరైనా పెట్టనీ, అస్తిత్వవాదమననీ మానవతావాదమననీ, ఆమోదించదగిందే.

ఈ సందర్భంలో సార్త్ర్ర్ మాట మరొకటి వినదగింది.

"…at the heart of the aesthetic imperative, there is the moral imperative."(“Why write?”: Sartre)

అధార్మికమైన కళ ఉండలేదు. కలం పట్టుకున్నావా, ధర్మమే పలుకగలవు.  అధర్మం పలుకలేవు. రాయలేవు, మనిషికి హాని కలిగించేదేదీ  రాయలేవు. ఇది నిజమైతే ఎంత సంతోషించదగిన మాట!

అంతేనా? సార్త్ర్ర్ మరో మాట:

 “…నిజానికి, అస్తిత్వవాదికి ప్రేమలేదు, ప్రేమనిండిన పనులు మాత్రమే.” (“…in reality, for the existentialist, there is no love apart from the deeds of love;”(సార్త్ర్)

( జిబ్రాన్ యిదే అంటాడు, “కనిపించే ప్రేమ కర్మ”, "work is love visible", అని.) “పని”కిరాని ప్రేమ పనికిరాదంటుంది అస్తిత్వవాదం.


“మనం మన కర్మలకే కాదు, లోకంలో అందరి కర్మలకు అందరి పాపపుణ్యాలకు  బాధ్యులం.”,అన్న యీ కథలోని హంతకుడి మాటకు వివరణ మనల్ని యింతదూరం తెచ్చింది.

                                                   *****

- డోస్టోవ్ స్కీ  కవలనవలలు: Crime and Punishment ;The Brothers Karamazov;                                            

Dostoevsky నవల The Brothers Karamazov లోని ప్రస్తుత  కథాభాగానికి  నేను చేసింది,  చాలావరకు  అనువాదము, కొంత అనుసరణము. కొన్ని చిన్నచిన్న మార్పులు. పాత్రలపేర్లు తీసేశాను. పేర్లు లేని లోపం కథలో  తెలియదు.

ఈ కథకు  పేరు " పాపము ప్రక్షాళనము” నేను పెట్టిందే.

“నేరము శిక్ష” (Crime and Punishment)  డోస్టోవ్ స్కీ  ప్రసిద్ధమైన నవల. కాని, యీనవలలో (The Brothers Karamazov), యీ కథాభాగంలో,  నేరము శిక్ష కంటే, పాపము ప్రక్షాళనము ప్రధానం. ("Not crime and punishment, but sin  and expiation." "Family Reunion": T.S. Eliot)

ఆంగ్లానువాదంలో ఈ భాగానికి The Mysterious Visitor అని పేరు.ఆంగ్లంలోని  ఈ పేరు, డోస్టోవ్ స్కీ ఉద్దేశించినది,  ఎక్కువ సార్థకం కావచ్చు.ఎందుకంటే, ఈ కథలో The second coming ప్రధానాంశం. ‘ నేను రెండవసారి వచ్చాను.గుర్తుంచుకో’, అన్న మాట కథాక్రమంలో కీలకమైన మార్పు, కథార్థంలో కీలకాంశం.  అంటే యీ కథలోని ప్రధానపాత్ర (అన్నట్టు యీ కథలో ప్రధానపాత్ర ఎవరు, హంతకుడా జోసిమానా?) జీసస్ కు ప్రతినిధి అని అనుకోవాలా? కథలో  అతడు రెండవసారి వచ్చింది, తన పరివర్తనకు కారణమైన జోసిమాను చంపడానికి. ఇది జీసస్ పునరాగమనం (Second Coming) వంటిది  ఎలా అవుతుంది? జీసస్  రెండవసారి ఎందుకు వచ్చాడో, దాని ప్రాధాన్యాన్ని పరమార్థాన్ని తెలియజెప్పడం, యీ కథలో హంతకుడు రెండవసారి రావడంలోని కథాప్రయోజనం.

ఈ భూమిపై అధర్మం తల ఎత్తుకొని తిరుగుతూ, ధర్మం తలదించుకుంటుందో అప్పుడు క్రీస్తు రెండవసారి అవతరించి దుష్టశిక్షణ చేసి శిష్టులను రక్షిస్తాడని బైబిల్ చెబుతుంది.

(Both the beast and the Antichrist will be thrown into the lake of fire to burn for all eternity (Revelation 19:20-21) and Satan will be bound in the bottomless pit for a thousand years. (Revelation 20:1-3)

ప్రస్తుత కథలో హంతకుడు నేను రెండవసారి వచ్చాను, గుర్తుంచుకో అంటాడు. అతడు జోసిమాను చంపడానికి రావడం, అధర్మం తల ఎత్తడంగా, తల వరకు ఎక్కడంగా,  అర్థం చేసుకోవలె. అధర్మం అంత పెరిగేవరకు క్రీస్తు చూస్తూ ఉంటాడు. అప్పుడు అవతరిస్తాడు. ఎక్కడ?
మనిషి అంతరంగంలో. మనిషిలోపల అధిష్ఠించిన దయ్యాన్ని నరికేసి మనిషిని కాపాడుతాడు. బైబిల్ లో చెప్పిన “రెండవ రాక” కు అర్థం యిది. క్రీస్తుచైతన్యం (Christ consciousness) మనిషి అంతరంగంలో అవతరించడం.

"భగవంతుడు ఆ క్షణం నా లోపలి  దయ్యాన్నుండి నన్ను కాపాడాడు. "

ఎప్పుడు కాపాడాడు?

“కాని, తెలుసా? ఆ రోజు నీవు మృత్యువుకు దగ్గరగా ఉన్నంతగా  ఎప్పుడూ లేవు.'

ఇక్కడ రచయిత చమత్కారం గమనించవలె. ఆ రోజు మృత్యువుకు దగ్గరయింది ఎవరు? జోసిమానా? హంతకుడా? పాపం శిఖరం చేరుకొన్నదెవరికి? (“అభ్యుత్థానమధర్మస్య”) హంతకుడిలో సైతాను తలకెక్కాడు. ఆ క్షణం వరకు, క్రీస్తు ఆగాడు. అప్పుడు సైతాను తల నరికి, హంతకుణ్ణి , మరో హత్య చేయకుండా కాపాడాడు.

ఇది యిందులోని “రెండవ రాక” అర్థం. క్రీస్తు ఎప్పుడో వస్తాడని ఎదురు చూడవద్దు. ఆయన ప్రతిక్షణము అవతరించడానికి ఆతురతతో ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా?

“Crime and Punishment” లో పశ్చాత్తాపం లేదు, ప్రక్షాళనం లేదు. రాస్కోల్నికోవ్ లో పశ్చాత్తాపం కలగదు, చివరి క్షణం వరకు కూడా. అతడికి కలిగింది పశ్చాత్తాపాగ్నిలో ప్రక్షాళనం కాదు. కథ ముగింపులో  అతడికి కలిగింది హఠాత్సాక్షాత్కారం, (revelation), ఒక మెరుపు.  అది కారాగారంలో శిక్షాకాలంలో జరిగింది.

“అది ఎలా జరిగిందో అతడికి తెలియదు. కాని, ఉన్నట్టుండి ఏదో అతన్ని బలంగా పట్టి ఆమె పాదాలవద్ద పడేసింది. అతడు ఏడ్చాడు.ఆమె మోకాళ్ళను తన చేతులతో చుట్టేశాడు. మొదట ఆమె భయంతో అదిరిపడింది. ముఖం వివర్ణమయింది. ఉదుటున పైకి లేచి, వణుకుతూ అతడివైపు చూచింది.కాని, అదే క్షణంలో ఆమెకు అర్థమయింది.ఆమె కన్నుల్లో  ఒక అనంతానందం  మెరుపులా మెరిసింది. ఆమెకు తెలిసింది, సందేహం లేదు. అతడు ఆమెను ప్రేమించాడు.ఆమె తప్ప అతడికి మరొక వస్తువు లేదన్నట్టు ప్రేమంచాడు.ఆ క్షణం వచ్చేసింది.”              (Crime and Punishment: Epilogue Two. ఇటాలిక్స్ నావి.)

రాస్కాల్నికోవ్ కు కలిగింది దివ్యప్రేమసాక్షాత్కారం. సోఫియా తన బియాట్రిస్. డోస్టోవ్ స్కీ కి  “ ద డివైన్ కామెడీ” తెలియదనలేము. Crime and Punishment నవల ముగింపు, పావకప్రక్షాళనం ( purgatory) లేని పరంధామం (paradiso).

కాని, The Brothers Karamazov లో నరకము (inferno)  పావకము ( Purgatorio) కలిసి భూమిపైకి దిగివస్తాయి.

డోస్టోవ్ స్కీని పోల్చాలంటే షేక్స్ పియర్ వరకు వెనక్కు నడవాలి. మేక్బెత్ హత్యాప్రవృత్తి, లియర్ ఉన్మాదము, ఒథెలో ఉద్రేకము, హేమ్లెట్ విషాదము, అన్నీ డోస్టోవ్ స్కీ పాత్రలలో కనిపిస్తాయి. కీర్క్ గార్డ్ అదే కదా అన్నాడు,

‘కాలం దుర్మార్గం అయింది అంటారు.నా అభియోగం అది కాదు.అల్పపు బతుకులు బతుకుతున్నారు జనం అంటాను. వారి కోర్కెలు అల్పం.వారి పాపాలు అల్పం. భావతీవ్రత లేదు.ఆర్తి లేదు. భగవంతుడిచ్చిన గొప్ప కానుక యీ బతుకు. మంచికో చెడుకో దాన్ని చివరి బొట్టు వరకు అనుభవించవలె కదా? అందుకే నా ఆత్మ ఎప్పుడూ బైబిల్ పాతనిబంధన, షేక్స్పియర్ నాటకాలవైపు వెళుతుంది . వాటిలో జనం కనీసం బతికున్న మనుషులు. వాళ్ళు ద్వేషిస్తారు ప్రేమిస్తారు పగవాళ్ళను నరుకుతారు శపిస్తారు.వాళ్ళు పాపాలు చేయగలరు.వాళ్ళు బతికున్నవారు. బతుకులో ఆర్తి (passion)  లేనివాడికి భగవంతుడి కొరకు ఆర్తి ఎట్లా ఉంటుంది?’
                                                                       (Kierkegaard:Either/Or :1843)

మనిషి  పుణ్యం చేయలేకపోయినా, పాపాలైనా చేయగలగాలి . రెండూ చేయనివాడికీ  బండకూ తేడా ఏముంటుంది?

డోస్టోవ్ స్కీ నవలలలోని పాత్రలు వెనుక జన్మలో  వైకుంఠంలో జయవిజయులై ఉంటారు. శిష్టులై ఆరు జన్మలా, దుష్టులై మూడు జన్మలా అని అడిగితే, తడుముకోరు. పాపం వారి ఊపిరి. అదే ముక్తిసాధనం కూడా.

                                                     *****

The Brothers Karamazov డోస్టోవ్ స్కీ చివరి నవల, అసంపూర్ణం కూడాను. ఈ అసంపూర్ణనవలలు కాఫ్కా ప్రత్యేకతగా ప్రసిద్ధం. కాఫ్కా  విషయంలో  ముగింపు అప్రధానం అని, వాటికి ముగింపు ఉండదని అతడి అభిప్రాయం అనుకోవచ్చు. డోస్టోవ్ స్కీ విషయం వేరు. అతడు ఆ నవలను కొనసాగించాలనే అనుకున్నాడు, ఆల్యోషా నాయకుడుగా. కాని ముగించలేకపోయాడు.
                                               *****



No comments:

Post a Comment